జాతీయవాదానికి కొత్త అర్థం చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్: ఏకంగా హిట్లర్తోనే ముడిపెట్టి...!
రాంచీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ మరో వివాదానికి తెర తీశారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోన్న ఆయన మరోసారి అలాంటి కామెంట్లను చేశారు. ఈ సారి జాతీయవాదం (నేషనలిజం) అనే పదంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నేషనలిజం అనే పదాన్ని ఇకపై ఎవరూ పలక వద్దని సూచించారు. ఈ పదానికి కొత్త అర్ధాన్ని ఇచ్చారాయన. ఆ పదాన్ని ఉచ్ఛరించవద్దనడానికి గల కారణాలనూ తన కోణంలో చెప్పుకొచ్చారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో గురువారం ఏర్పాటైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్లో నివసించే ప్రతి పౌరుడూ జాతీయ గీతానికి, జాతీయ జెండాకు తలవంచి తీరాల్సిందేనని, గౌరవించాల్సిందేనని అన్నారు.
పుట్టిన గడ్డకు రుణపడి ఉండాలని, అదే భావాన్ని, అభిమానాన్ని చివరి వరకూ ప్రదర్శించాలని సూచించారు. నేషనలిజం అనే పదం ప్రమాదకర నియంత హిట్లర్ను సూచిస్తోందని మోహన్ భగవత్ అన్నారు. హిట్లర్, నాజీయిజానికి ప్రతిబింబించేలా నేషనలిజం అనే పదం ఉందని అన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా నేషన్, నేషనల్, నేషనాలిటి అనే పదాలను పలకాలని సూచించారు. హిట్లర్, నాజీయిజం, నేషనలిజం.. ఈ మూడు ఒకే అర్ధాన్ని ఇస్తాయనీ చెప్పారు.
ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు డ్రైవర్..కండక్టర్ సహా 20 మంది దుర్మరణం..క్రేన్లు, గ్యాస్ కట్టర్లు
హైందవ సమాజాన్ని ఏకం చేయడం మినహా ఆర్ఎస్ఎస్కు మరో పని లేదని అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ హిందుత్వ, జాతీయ భావాలను పెంపొందించడం, పీడిత రహిత సమాజాన్ని స్థాపించడం మినహా మరో లక్ష్యం తమకు లేదని చెప్పారు. ఆర్ఎస్ఎస్ భావజాలన్ని అనుసరించేలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్.. కేంద్ర ప్రభుత్వాన్ని సైతం శాసించే స్థాయిలో ఉందని, తన కనుసన్నల్లోకి ప్రభుత్వాలను తీసుకుని వచ్చిందనే విషయాన్ని ఆయన తోసిపుచ్చారు.
Recommended Video
ప్రభుత్వ కార్యకలాపాల్లో గానీ, పాలకుల వ్యవహారాల్లో గానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని మోహన్ భగవత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ పెద్దల అండదండలేవీ లేకుండానే.. తాము తమ గమ్యాన్ని చేరుకుంటామని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ గుర్తింపు తెచ్చుకునే స్థాయి నుంచి.. భారత్ అవసరం ఉందని ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి మనదేశం ఎదిగిందని, దీనికి ప్రధాన కారణం.. హిందుత్వమేనని మోహన్ భగవత్ అన్నారు.