'ఏదో ఒకటి చేయండి లేదంటే చావడానికి సిద్ధం కండి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిపోవడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ రాహుల్ బజాజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని, దీనిని తగ్గించేందుకు ఏదో ఒకటి చేయాలని లేకుంటే చనిపోయేందుకు సిద్ధం కావాలని వ్యాఖ్యానించారు.
'కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టే ఏ చర్యనైనా స్వాగతించాల్సిందే. మంచి పనులు చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. వీటిని భరించకపోతే కాలుష్యం బారిన పడి చనిపోడం ఖాయం. పొగమంచుతో ప్రాణాలు పోతాయి' అని రాహుల్ బజాజ్ అన్నారు.
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు జనవరి 1 నుంచి సరి-బేసీ నెంబర్ ప్లేట్ ఫార్ములాలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు వాహనాలను రోడ్డు మీదకు అనుమతిస్తామని ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆయన మద్దతు పలికారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంచి ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశారని అన్నారు. ఈ సందర్భంగా 'కారు పూల్'ను ప్రోత్సహించాలని ఆయన కోరారు. 'కారు యజమానులు సైకిల్పై వెళ్లమని లేదా బస్సులో వెళ్లాలని నేను చెప్పడం లేదు. మీరు ఆఫీసుకు వెళ్లేటప్పుడు మీ స్నేహితుడిని కారులో తీసుకెళ్లండి లేదా మిమ్మల్ని పికప్ చేసుకోమని మీ స్నేహితులకు చెప్పండి.' అని రాహుల్ బజాజ్ సూచించారు.
జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు వీవీఐపీలు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులకు కూడా వర్తించేలా కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, అత్యవసర వాహనాలైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వ్యాన్లకు వర్తించవని తెలిపారు. ఆదివారం ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సరి-బేసీ నెంబర్ ప్లేట్ ఫార్ములాకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సైతం మద్దతు తెలిపారు. అవసరమైతే మోతీలాల్ మార్క్లోని తన ఇంటిన నుంచి సుప్రీం కోర్టుకు నడిచి వెళ్లడానికి తనకెలాంటి ఇబ్బంది లేదన్నారు.
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి నడిచి వెళితే జనం ఆలోచిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడైనా ఢిల్లీలో కాలుష్యం తగ్గే అవకాశముందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జస్టిస్ ఠాకూర్ మద్దతు తెలపడంతో ఆయనకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.