‘ఉరి’కి కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా?: వెంకయ్య
న్యూఢిల్లీ: ముంబై వరుస పేలుళ్ల కేసు దోషి యాకుబ్ మెమన్ను ఉరి తీసిన రోజు మీడియాలో వచ్చిన పలువురి భిన్న అభిప్రాయాలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉరి శిక్ష విషయంలో కూడా వారు రిజర్వేషన్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల రోజు చాలా మంది వేరే అంశంపై దృష్టి పెట్టారన్నారు. కొన్ని మీడియాలైతే ఏ వర్గానికి చెందిన వారిని ఇంతవరకు ఉరి తీశారని నంబర్లు కూడా ఇచ్చారని చెప్పారు.
అయితే ప్రజలు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదని అన్నారు. గత కొన్నేళ్లలో 36మందిని ఉరి తీశారని, వారిలో మక్బూల్ భట్, అఫ్జల్ గురు, కసబ్, యాకుబ్ మెమన్ కూడా ఉన్నారన్నారు. అయితే వారు ఏ వర్గానికి చెందిన వారనే విషయంపై తాను మాట్లాడనని తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని ఉరితీశారనే విషయంపై చాలా స్పష్టమైన వివరాలు ఉన్నాయని తెలిపారు. అలాగని ఉరితీసే విషయంలో మీరేమైనా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా? అని వెంకయ్య ప్రశ్నించారు. అసలీ విషయాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నానని విస్మయం వ్యక్తం చేశారు.