మోడీకి ఏమైనా 100 తలలు ఉన్నాయా..? రావణుడా..? ఖర్గే కామెంట్స్, బీజేపీ ఫైర్
ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ఏ ఎన్నికల్లో అయినా సరే మోడీ పేరు చెబుతారా అని అడిగారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఖర్గే పాల్గొన్నారు. ప్రధాని మోడీని రావణుడితో పోల్చారు. దీంతో బీజేపీ శ్రేణులు ఒంటికాలిపై లేస్తున్నాయి. అహ్మదాబాద్లో గల బెహరామ్పురలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో మోడీ మొహం చూస్తాం.. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన ఫేసే చూస్తాం అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఫోటో తప్పదు అన్నారు. ప్రతీ చోట మోడీ ఉండడానికి అతనికి 100 తలలు ఉన్నాయా అని అడిగారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ ఫోటో ఉండటానికి ఆయన మీకు సాయం చేస్తారా అని ప్రశ్నించారు.
ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. కాంగ్రెస్ అధ్యక్షుడు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ గుజరాతీలను, మోడీని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఇదీ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన తీరు అని.. యావత్ దేశం దీనిని చూసిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు.
గుజరాత్కు మరింత గౌరవాన్ని నరేంద్ర మోడీ తీసుకొచ్చారని తెలిపారు. దేశం అభివృధ్ది కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ఈ మాటలు ఖర్గే నోటి నుంచి వచ్చినా.. ఆలోచన మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీవి అయి ఉంటాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత వ్యాఖ్యలను గమనించాలని.. ప్రతీ ఒక్కరూ బుద్ది చెప్పాలని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చి.. ఓటు వేయాలని కోరారు.