మీరు కొత్త సంవత్సరంలో రిజల్యూషన్ తీసుకున్నారా... అయితే మీకోసం తీర్మానం ఇదిగో..!
సాధారణంగా కొత్త ఏడాదిలో మనకు మనం ఒక తీర్మానం చేసుకుంటాం. 2019వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఒకవేళ ఇంకా తీర్మానం కనుక తీసుకోనట్లయితే కంగారక్కర్లేదు. ఇంకా సమయం ఉంది. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటామని తీర్మానం చేసుకుని ఉంటే ఇక ఆలస్యమెందుకు ఈరోజు నుంచే దాన్ని అమలు పరచండి. ఓ కొత్త విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి.
చివరిసారిగా మీరు ఎప్పుడు ఒక మంచి పుస్తకం చదివారు..లేదా ఒక మంచి కథనం కోసం ఒక మ్యాగజీన్ను తిరిగేశారు? మీరు ప్రతిరోజు చదివేది అంతా సోషల్ మీడియాకే పరిమితమైందా... అంటే మీ చదువంతా ఫేస్బుక్, ట్విటర్ అప్డేట్లపైనే ఉందా...అయితే ఇప్పుడే దానికి స్వస్తి పలకండి. ప్రతిరోజు మంచి కథనాలు, లేదా వార్తలు చదవకపోతే మీరు ఎంతో కోల్పోయిన వారవుతారు.
ప్రతిరోజు ఉదయం మిమ్మలను పలకరించేది వార్తలే. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే న్యూస్ పేపర్ చదవకపోతే ఆరోజు పూర్తయినట్లు ఉండదు. చాలామంది నిద్రలేవగానే ముందుగా వెతికేది న్యూస్ పేపర్ కోసమే.వేడి వేడిగా కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదివి అందులోని వార్తలు కాఫీతో పాటు ఆస్వాదించడం చాలామందికి ఉన్న అలవాటు. న్యూస్ పేపర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వార్తలను చేరవేస్తాయి. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నట్లయితే ఆ వార్తలన్నీ మీఫోన్లోనే చదవచ్చు. ఇలా చదవడం వల్ల కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధిస్తారు. ఒక్క మనదేశంలో జరిగే వార్తలే కాదు ఇతర దేశాల వార్తలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి.
ఒక దేశ ఆర్థిక పరిస్థితి గురించి వార్తలు ఉంటాయి, క్రీడలు, ఎంటర్టెయిన్మెంట్, వాణిజ్యం ఇలా పలు అంశాలకు సంబంధించిన వార్తలు ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని రాజకీయాలు, సంస్కృతి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయో తెలుపుతాయి వార్తలు. చుట్టుపక్కల జరుగుతున్న విశేషాలు తెలుసుకోవాలనుకునే వారికి కచ్చితంగా వార్తలు సంతృప్తినిస్తాయి. అందుకే మీ కొత్తసంవత్సరం తీర్మానం జాబితాలో ఈ సారి విజ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు పలు విషయాలు తెలుసుకుంటామని చేర్చండి. 2019 సంవత్సరం మీకు తప్పకుండా బెస్ట్ ఇయర్ అవుతుంది.