జనరల్ నాలెడ్జ్: తుఫానులకు ఆ పేర్లు ఎలా వస్తాయి..? ఎవరు ఇస్తారు..?
ఫొణి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రళయానికి ఇప్పటికే పలువురు మృతి చెందారు. భారీగా వీస్తున్న గాలులు భారీ వాహనాలను సైతం కుదిపేస్తున్నాయి. పెద్దపెద్ద టెలిఫోన్ టవర్లు ఈ తుఫాను ముందు నిలవలేక పిట్టలు రాలినట్లు రాలుతున్నాయి. అసలు తుఫానులకు పేర్లు ఎలా వస్తున్నాయి..? ఎవరు పెడతారు...?
ఫొణి పేరును పెట్టిన బంగ్లాదేశ్
మాలా, హెలెన్, నీలోఫర్...ఈ పేర్లు ఏ బాలీవుడ్ నటీమణుల పేర్లో అనుకుంటే పొరపాటే. ఇవి తుఫాన్ల పేర్లు. పెను గాలులు, భారీ వర్షాలతో పెను బీభత్సాన్ని సృష్టించిన తుఫాన్లకు ఇచ్చిన పేర్లు. ప్రస్తుతం తీరప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న ఫొణి తుఫాను పేరును బంగ్లాదేశ్ నామకరణం చేసింది. ఫణిని ఫొనిగా పలుకుతామని దీనర్థం పాము పడగ విప్పినప్పుడు పడగ వెనక వైపు రెండు అండాకార గుర్తులు ఒక వంపు గీతతో కలుపబడి ఉంటాయి. దీన్నే ఫణి అంటాము.
తుఫానులకు ఆ పేరు ఎలా పెడతారు..?
తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణ/ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఆసియా మరియు పసిఫిక్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 2000వ సంవత్సరంలో 27వ సదస్సును మస్కట్, ఓమన్ దేశాల్లో నిర్వహించింది. ఆ సదస్సులో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులకు సంబంధించి పేర్లు పెట్టాలన్న ఒప్పందానికి వచ్చాయి. ఇక పలుమార్లు సభ్యదేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత 2004 సెప్టెంబరులో తుఫానులకు నామకరణం చేయడం మొదలు పెట్టారు. బంగాళా ఖాతం, మరియు అరేబియన్ సముద్రాల తీరంలో ఉన్న ఎనిమిది దేశాలను ముందుగా గుర్తించారు. ఆంగ్ల పదక్రమంలో వాటిని పొందుపర్చారు. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్లాండ్ దేశాలను పొందుపర్చారు.
కొన్ని పేర్లను ముందుగానే సెలెక్ట్ చేస్తారు
ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం కొన్ని పేర్లను సెలెక్ట్ చేసి రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్యదేశాలను కోరుతుంది. ఇది అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ ఒనిల్ అనే పేరును సెలెక్ట్ చేసింది. అరేబియ సముద్రంలో ఈ తుఫాను కేంద్రీకృతమైంది. గుజరాత్ తీరంను కూడా తాకింది. ఈ తుఫాను 2004 సెప్టెంబర్ అక్టోబర్ నెలల మధ్య బీభత్సం సృష్టించింది. గుజరాత్ను అతలాకుతలం చేసింది.భారత్ పాకిస్తాన్లో ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది.
ఏపీని కబళించిన తుఫానుకు పెథాయ్గా పేరుపెట్టిన థాయ్లాండ్
పెథాయ్ తుఫాను బంగాళాఖాతంలో తొలుత కేంద్రీకృతమైంది. ఈ పేరును థాయ్ల్యాండ్ పెట్టింది.ఇది ఆంధ్రప్రదేశ్లో బీభత్సం సృష్టించింది.ఇక భవిష్యత్తులో మరో తుఫాను వస్తే దానికి వాయు అనే పేరును భారత్ పెట్టనుంది. మొత్తం 64 పేర్లను ఈ ఎనిమిది దేశాలు ఎంపిక చేయగా ఇప్పటికి 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేసేశారు. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా... మాలా అనే పేరును శ్రీలంక సూచించింది. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయగా.. నీలోఫర్ పాకిస్తాన్ పెట్టింది. అయితే జాబితాలోని ఈ పేర్లు ఒక క్రమంలో పెడతారని తిరిగి మళ్లీ అవే పేర్లను పెట్టరని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరు తుఫాన్లకు పేర్లు పెట్టొచ్చని అయితే దీనికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పెట్టే పేరు చాలా పొట్టిగా ఉండి ఒక దేశ సంస్కృతితో ముడిపడి ఉండకూడదని, పెడర్థాలు వచ్చేలా ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి.
తుఫాన్లకు పేరు పెట్టే సంస్కృతికి అమెరికా తెరలేపిందని ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఇలా పేర్లు పెట్టడం వల్ల తుఫానులను సులభంగా గుర్తించగలిగే అవకాశం ఉంటుందని చెప్పారు. దక్షిణ పసిఫిక్ సముద్రం, హిందూ మహాసమద్రంలలో ఏర్పడే గాలివర్షాలను తుఫానుగా పిలుస్తున్నారు. అదే ఉత్తర అంట్లాంటిక్, సెంట్రల్ నార్త్ పసిఫిక్ ఈస్ట్రన్ పసిఫిక్లలో తుఫాన్లను హరికేన్లుగా పిలుస్తున్నామని చెప్పారు.