మీ ఇళ్లల్లో కరెంట్ ఉండాలో.. దీపం బుడ్డీ ఉండాలో తేల్చుకోండి : బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ మరోసారి ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. వాళ్ల హయాంలో మహిళలను,బీసీలను పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మాత్రం మహిళా లోకాన్ని ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు. ఆర్జేడీ తప్పుదోవ పట్టించే విధానాలను బీహారీ ప్రజలు గమనించాలన్నారు. గతంలో బీహార్లోని నగరాల్లో సైతం విద్యుత్ ఉండేది కాదని... తాము అధికారంలోకి వచ్చాకే 'లాంతరు శకం'కు ముగింపు పలికామని అన్నారు. తద్వారా పరోక్షంగా ఆర్జేడీని టార్గెట్ చేశారు నితీశ్. ఆర్జేడీ ఎన్నికల గుర్తు 'లాంతరు' అన్న సంగతి తెలిసిందే.
Recommended Video
బీజేపీకి బీహార్ సీఎం నితీశ్ షాకిచ్చారా? - లక్షల్లో ఉద్యోగాల హామీని పచ్చి బోగస్ అంటూ ఫైర్
శుక్రవారం(అక్టోబర్ 30) పర్బట్టా ఎన్నికల ప్రచార సభలో నితీశ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'రాష్ట్రంలో మరోసారి లాంతరు శకం కావాలని మీరు కోరుకుంటున్నారా.. కరెంట్కు బదులు మీ ఇళ్లల్లో దీపం బుడ్డీలు ఉండాలనుకుంటున్నారా.. మీకు లాంతరు శకం కావాలో ఎల్ఈడీ శకం కావాలో నిర్ణయించుకోండి.' అని నితీశ్ ఓటర్లను ఉద్దేశించి పేర్కొన్నారు.
లాలూ హయాంలో మహిళలు నిరాదరణకు గురయ్యారని... ఆర్జేడీ ప్రభుత్వం వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని నితీశ్ ఆరోపించారు. పశువుల దానా కుంభకోణం కేసులో ఇరుక్కున్నాక... లాలూ ఆయన సతీమణికి సీఎం కుర్చీ ఇవ్వడం తప్పించి మహిళా సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు.
ఇవాళ బీహార్ అభివృద్దిని సాధించిందంటే దానికి ప్రధాన కారణం మహిళలేనని నితీశ్ పేర్కొన్నారు. మహిళల ఎదుగుదల కోసం తాము చిత్తశుద్దితో పనిచేశామన్నారు. బీహార్ ప్రజలు తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినప్పుడు... గ్రామ పంచాయితీల్లో,స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించామన్నారు. మహిళల కోసమే బీహార్లో మద్యపాన నిషేధాన్ని అమలుచేశామన్నారు. కాబట్టి ఎన్నికలు జరిగే నవంబర్ 3న మహిళలు తప్పకుండా ఓటింగ్లో పాల్గొనాలని... ముందు ఓటు వేశాకే,తర్వాత ఇంటికొచ్చి వంట చేసుకోవాలని సూచించారు.
ఆర్జేడీ చెప్తున్న 10లక్షల ఉద్యోగాలు కేవలం నిరుద్యోగులను మభ్య పెట్టేందుకేనని... అది సాధ్యం కాదని నితీశ్ మరోసారి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే.. ప్రతీ గ్రామంలో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతీ పంట పొలానికి సాగునీరు అందిస్తామన్నారు.