దారుణం : బైక్పై వచ్చి డాక్టర్ను కాల్చి చంపిన దుండగులు..
కర్నాల్ : హర్యానాలో దారుణం జరిగింది. కారులో మార్కెట్కు వెళ్తున్న డాక్టర్పై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఎం సొంత నియోజకవర్గంలో డాక్టర్ హత్య జరగడంతో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
కర్నాల్కు చెందిన రాజీవ్ గుప్తా డాక్టర్. ఆయనకు సొంతంగా హాస్పిటల్ ఉంది. శనివారం సాయంత్రం తన కారుతో డ్రైవర్తో కలిసి చౌరా బజార్కు వెళ్తుండగా.. బైక్పై ముసుగు వేసుకుని వచ్చిన ముగ్గురు దుండగులు కారును ఆపారు. వెంటనే తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజీవ్కు రెండు బుల్లెట్లు తాకాయి. కాల్పుల అనంతరం దుండగులు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
డాక్టర్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 8 పోలీసుల బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ హత్య వెనుక గల కారణాల గురించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కర్నార్ అసెంబ్లీ నియోజకవర్గానికి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్లైంది. బీజేపీ హయాంలో శాంతిభద్రతలు గాలి కొదిలేశారని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ ఆరోపించింది.