coronavirus: కారులోనే డాక్టర్ నిద్ర, వారం రోజుల నుంచి ఇక్కడే, భార్య, పిల్లలకు దూరంగా, సీఎం ప్రశంసలు.
కరోనా.. కరోనా.. కరోనా.. వైరస్ పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రోగులకు డాక్టర్లు వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నార. భోపాల్కు చెందిన ఓ వైద్యుడు మాత్రం రోగులకు చికిత్స అందిస్తూనే.. తన కుటుంబం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కారులోనే..
భోపాల్లోని జేపీ ఆస్పత్రిలో డాక్టర్ సచిన్ నాయక్ పనిచేస్తున్నారు. కరోనా వైరస్ రోగులకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అయితే వైద్యుడిగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకైనా మంచిదని.. గత వారం రోజుల నుంచి తన ఇంట్లోకి వెళ్లడం లేదు. కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నారు. స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉంటున్నారు. ఆస్పత్రి వద్ద కారులోనే పడుకుంటున్నారు. కారు అంటే అందుకు సకల సౌకర్యాలు కల్పించారు. తన భార్య, పిల్లలకు దూరంగా ఉంటే.. వారికి తగిన రక్షణ కల్పించగలిగిన వారినవుతానని చెబుతున్నాడు.
అక్కడే పడుకొని
ఆ కారును పడుకునేవిధంగా తీర్చిదిద్దుతున్నాడు. అందులో తనకు అవసరమయ్యే వస్తువులను, పుస్తకాలను సమకూర్చాడు. రాత్రి పడుకునేందుకు కారులోకి వచ్చాక.. కుటుంబసభ్యులతో ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతారు. తర్వాత పుస్తకాలు చదివి నిద్రకు ఉపక్రమిస్తారు. మరునాడు ఉదయం లేచి విధులకు హాజరవుతున్నాడు. గత వారం రోజుల నుంచి సచిన్ నాయక్ ఈ విధంగా ఆస్పత్రి వద్ద గల కారులోనే ఉంటున్నారు.
Recommended Video
ఫ్యామిలీ కోసం
భోపాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే తాను భయపడ్డానని నాయక్ పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు రికార్డవడంతో.. తాను కారులోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. డాక్టర్ కారులోనే పడుకునే అంశానికి సంబంధించి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కూడా నాయక్పై పొగడ్తల వర్షం కురిపించారు. ‘యావత్ మధ్యప్రదేశ్ మొత్తం మీలాగే వ్యవహరిస్తే, కరోనా మహమ్మరిపై విజయం సాధించడం సునాయసం అవుతుంది. అందరూ ఈ విధంగా ఆలోచించాలి' అని శివరాజ్సింగ్ చౌహన్ పేర్కొన్నారు.