జయకు చికిత్సపై శశికళకు షాక్: గొంతు విప్పిన డాక్టర్
జయలలితకు అందించిన చికిత్సపై, ఆమె ఆరోగ్యంపై పలు విషయాలు మాట్లాడడం ద్వారా శంకర్ అనే వైద్యుడు శశికళకు పెద్ద షాక్ ఇచ్చారు.
చెన్నై: దివంగత నేత జయలలితకు అందించిన చికిత్సపై చిన్నమ్మ శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలింది. జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమ్మ అక్యుపంక్చరిస్ట్ శంకర్ గొంతు విప్పారు. తాను చికిత్స చేసి ఉంటే అమ్మ జయలలిత బతికి ఉండేవారని ఆయన అంటున్నారు.
పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే జయలలిత తన చికిత్సతో కోలుకున్నారని, 2016 ఆగస్టు నాటికి ఆమె బాగానే ఉన్నారని, వైద్యులు ఆమెకు ఇచ్చిన స్టీరాయిడ్స్ చాలా ప్రమాదకరమైనవని ఆయన అన్నారు. అయితే, తాను విదేశాలకు వెళ్లొచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని అన్నారు.
జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చారని, తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ తియ్యలేదని చెప్పారు. 'ఇండియా టుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. జయలలిత షుగర్, బీపీ, థైరాయిడ్, ఆర్థరైటిస్, వెర్టిగో వంటి పలుసమస్యలతో బాధపడేవారని, తాను చికిత్స ప్రారంభించే సమయానికి ఆమె రక్తంలో షుగర్ లెవెల్స్ ఏ మాత్రం నియంత్రణలో ఉండేవి కాదని చెప్పారు.
ఆమె ఐస్క్రీములు, చాక్లెట్లు ఎక్కువగా తినేవారని, దానికి కారణం అదేనని ఆయన అన్నారు. షుగర్ తగ్గడానికి ఇన్సులిన్ తీసుకునేవారని, వెర్టిగో కారణంగా బయటకు కూడా వెళ్లలేకపోయేవారని, దీర్ఘకాలంపాటు తీసుకున్న స్టీరాయిడ్ల కారణంగానే బహుశా ఆమెకు అన్ని సమస్యలు వచ్చి ఉంటాయని చెప్పారు.
అయితే, తన చికిత్సతో ఆమె పరిస్థితి బాగా మెరుగుపడిందని, స్టీరాయిడ్లను తగ్గించే విషయంలో తనకు సహకరించారని, తాను చికిత్స చేసిన తర్వాత ఆమె ఎలాంటి మందుల అవసరం లేకుండా హాయిగా నిద్రపోగలిగేవారని శంకర్ చెప్పారు. నిరుడు ఆగస్టు 15న ఆమె 45 నిమిషాలపాటు నిలబడగలిగారని చెప్పారు.
జయలలిత బాగా కోలుకున్నారని, ఆ తర్వాత ఇక ఆమె వ్యక్తిగత వైద్యులు తదుపరి చికిత్స చేయడానికి రావాల్సిందిగా తనను పిలవలేదని చెప్పారు. ఇదే సమయంలో తాను పన్నీర్ సెల్వాన్ని, శశికళను గానీ, ఇతరులను ఎవరినీ సమర్థించడం లేదని చెప్పారు. జయలలిత చికిత్సపై చర్చ జరుగుతోంది కాబట్టి తాను ఈ విషయాలను ఈ సమయంలో చెబుతున్నట్లు ఆయన తెలిపారు.