coronavirus: వైద్య సిబ్బంది వాహనంపై అల్లరిమూక దాడి, పోలీసులపై కూడా, ఎన్ఎస్ఏ కింద కేసు..
కరోనా వైరస్ సోకిన ఇద్దరిని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి ఓ సమూహం నుంచి చుక్కెదురైంది. వారి వాహనంపై 10 మందితో కూడిన మూక దాడికి తెగబడింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను కూడా వదల్లేదు. ఉత్తరప్రదేశ్ మొరదాబాద్లో బుధవారం ఉదయం ఘటన జరిగింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
అంబులెన్స్పై రాళ్ల దాడులు..ధ్వంసం: కరోనా అనుమానితుల ఘాతుకం: పోలీసు వాహనాలనూ వదల్లేదుగా..
మొరాదాబాద్ నవాబ్ జంగ్ ప్రాంతంలో ఇద్దరికీ కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. వారిని తీసుకెళ్లేందుకు వైద్య సిబ్బంది వచ్చారు. అయితే అనూహ్యంగా కొందరి నుంచి ప్రతిఘటన ఎదురైంది. వైద్యుల వాహనంపై రాళ్లతో దాడి చేశారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు కూడా రంగంలోకి దిగారు. అయితే అల్లరిమూకలు పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. ఘటన తర్వాత దాడిచేసిన 10 మందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మొరాదాబాద్లో వైద్య సిబ్బంది, పోలీసులపై అల్లరిమూకలు దాడిచేయడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్గా తీసుకున్నారు. దుండగులపై జాతీయ భద్రతా చట్టం కింద కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు. అంతేకాదు దాడిలో జరిగిన నష్టాన్ని కూడా ఆ అల్లరిమూక భరించాలని సీఎం స్పష్టంచేశారు. వైద్య సిబ్బందిపై దాడి చేయడంతో.. ఆ ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు.