దేశవ్యాప్తంగా స్తంభించిన వైద్య సేవలు.. ఎన్ఎంసీ బిల్లును నిరసిస్తూ డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్/ఢిల్లీ : కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన బాట పటట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఓపీ సేవలు బహిష్కరించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ, తెలంగాణల్లోనూ వైద్యులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే ఎమర్జెన్సీ, సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదని ప్రకటించారు. ఓపీ సేవలు నిలిచిపోవడంతో పలుచోట్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్లో నిలిచిపోయిన ఓపీ సేవలు
ఎంసీఐ పిలుపు మేరకు హైదరాబాద్లో ప్రభుత్వ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. నిలోఫర్ హాస్పిటల్లో విధులు బహిష్కరించిన డాక్టర్లు ధర్నా నిర్వహించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అటు ఏపీలోనూ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. గుంటూరు సహా పలు జిల్లాల్లో డాక్టర్లు విధులు బహిష్కరించారు. వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని గుంటూరు జీజీహెచ్ ఎదుట ఐెంఏ, ప్రభుత్వ డాక్టర్లు, జూడాలు ధర్నా చేపట్టారు. డాక్టర్లతో పాటు రోగులు, వైద్య విద్యార్థులపైనా ఈ బిల్లు ప్రభావం చూపుతుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 3లక్షల మంది ధర్నా
కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది డాక్టర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర నగరాల్లోనూ వైద్యులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. బెంగాల్లో వైద్యులు, మెడికల్ స్టూడెంట్స్ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఎన్ఎంసీ బిల్లును వెంటనే రద్దు చేసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఎయిమ్స్ దవాఖానాల రెసిడెంట్ డాక్టర్స్ సంఘం బిల్లును నిరసిస్తూ నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు.
పేదల ప్రజలకు ప్రమాదం
రోగులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యానికి ఈ బిల్లు వ్యతిరేకమని తమ ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోతే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఐఎంసీ వార్నింగ్ ఇ్చిచంది. బిల్లులోని సెక్షన్ 32 ప్రకారం మూడున్నర లక్షల మంది అర్హతలేని వ్యక్తులకు సమాజ ఆరోగ్యం పేరుతో లైసెన్సులు జారీ చేసే నిబంధన వైద్య ప్రమాణాలను దెబ్బతీస్తుందన్నది డాక్టర్ల ఆరోపణ. ఇది పేద ప్రజల జీవితాలకు ప్రమాదకరంగా మారుతుందని వారంటున్నారు. సెక్షన్ 45 ప్రకారం నేషనల్ మెడికల్ కమిషన్ విధులు, అధికారాల్లో కేంద్రానికి పెత్తనం కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. ఇది వైద్య రంగ స్వయం ప్రతిపత్తిని, ఆత్మగౌరవాన్ని బిల్లు దెబ్బతీసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.