నిను వీడని వైరస్ నేనే... వదలనంటోన్న కరోనా.. డాక్టర్లు నర్సులను వెంటాడుతున్న కోవిడ్-19..!!
హైదరాబాద్ : కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలనంటోంది. అత్యుత్తమ జాగ్రత్తలు తీసుకుంటూ రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు. నర్సులను కూడా క్షమించేది లేదంటోంది కరోనా. స్వీయ నియంత్రణ పాటిస్టూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా దేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఐసోలేషన్ వార్డుల్లోకి ప్రవేశించి డాక్టర్లు, నర్సులతో చెలగాటమాడుతోంది కరోనా. తాజాగా నీలోఫర్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ నర్సుకి కరోనా పాజిటీవ్ సోకడమే కాకుండా, పశ్చిమ బెంగాల్ లో ఓ వైద్యుడు కరోనా బారిన పడి మృతిచెందిన సంఘటన ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అంతే కాకుండా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయ తాండవానికి యవత్ ప్రజానికం భయబ్రాంతులకు గురయ్యే పరిస్థితులు తలెత్తాయి.
స్టాఫ్ నర్స్ కు కరోనా.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్య బృందాలు..
విధి నిర్వహణలో భాగంగా గత నెల రోజులుగా క్షణం తీరిక లేకుండా వైద్య సేవలందించిన ఒక స్టాఫ్ నర్సుకు కరోనా వైరస్ సోకడం నీలోఫర్ ఆస్పత్రిలో కలకలం రేపుతోంది. ఆమె పదిహేను రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ ఐన రోగులకు ఆమె చికిత్స అందించడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఆ తర్వాత ఆ స్టాఫ్ నర్స్ చాలా మందికి వైద్య సేవలు అందించిన ఈ నేపథ్యంలో వారంతా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల స్టాఫ్ నర్స్ నీలోఫర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుంది. గత కొంత కాలంగా పలువురు కరోనా బాధితులకు వైద్య సేవలు అందించారు ఆ స్టాఫ్ నర్స్.
కరోనా సోకిన నర్స్ గాంధీకి తరలింపు.. భయాందోళనలో గ్రామస్తులు..
అయితే ఆమెకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని అనుమానం రావడంతో ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. వాటి రిపోర్టు మంగళవారం ఉదయం రావడంతో వాటిని పరిశీలించారు. స్టాఫ్ నర్సుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆదివారం నుంచి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలోని తన సొంత ఇంట్లో హోమ్ క్వారెంటెన్ లో ఉన్న ఈ స్టాఫ్ నర్స్ ను గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో స్టాఫ్ నర్స్ చికిత్స అందిస్తామని, పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని ఆమె కుటుంబ సభ్యులకు వైద్య అధికారులు ధైర్యం చెబుతున్నారు.
కరోనా వైరస్ తో డాక్టర్ మృతి.. బెంగాల్ లో చోటు చేసుకున్న విషాద ఘటన..
ఇదిలా ఉండగా కరోనా వైరస్ సోకి ఏకంగా ఓ డాక్టర్ మరణించడం ఆందోళనకరంగా మారింది. ఏకంగా డాక్టర్ మరణించడం వైద్య వర్గాల్లో విషదఛాయలు అలుముకున్నాయి. ఐసోలేషన్ వార్డుల్లో వైద్యం అందించేందుకు వైద్య వర్గాలు భయపడుతున్నాయి. దేశంలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ ఏకంగా ఓ వైద్యుడి చావుకు కారణం కావడంపట్ల తోటి డాక్టర్లలో అయోమయం నెలకొంది. గత నెల రోజులుగా విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది కరోన అనుమానిత వ్యక్తులకు, కరోనా పాజిటివ్ తేలిన రోగులకు చికిత్స అందించిన వైద్యుడు చివరికి అదే కరోనా బారినపడి మృత్యువాత పడ్డాడు. మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ సోకి డాక్టర్ మృతి చెందాడు. అరవై తొమ్మిదేళ్ల ఈ వైద్యుడు కరోనా వైరస్ తో మృతి చెందినట్లు పశ్చిమ బెంగాల్ వైద్యాధికారులు నిర్దారించారు.
విచారం వ్యక్తం చేస్తున్న డాక్టర్లు.. డాక్టర్లకు సాంకేతిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్..
వైద్యుని మృతితో పశ్చిమ బెంగాల్ వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం నెలకొంది. కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్న వారికి ఇవ్వాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ఇవ్వకపోవడం వల్లే వైద్యులకు కరోనా సోకుతుందని బెంగాల్ మెడికల్ స్టాప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐసీఎంఆర్ నిర్దేశించిన పి పి ఈ కిట్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సరైన సంఖ్యలో అందుబాటులో లేవని బెంగాల్ వైద్య వర్గాలు వాపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరించి ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రభుత్వం సరైన సాంకేతిక సౌకర్యాలను పొందగలిగితే ప్రణనష్టాన్ని నివారించొచ్చని బెంగాల్ వైద్య బృందం చెప్పుకొస్తోంది.
Recommended Video