ఇంతకీ ఏముంది: కడుపునొప్పితో గోవు...సర్జరీ చేసిన వైద్యులు అవాక్కయ్యారు
చెన్నై: ప్లాస్టిక్ మానవాళికి ప్రమాదంగా పరిణమించింది. అందుకే సింగిల్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వస్తువులు పడివేయడంతో వాటిని జంతువులు కూడా తినేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో వెటిరినరీ వైద్యులు ఓ ఆవు కడుపులో నుంచి 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.
కడుపు నొప్పితో బాధపడ్డ ఆవు
తమిళనాడులోని తిరుముళ్లైవోయల్లో ఓ ఆవు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ రంకెలేస్తుండగా దాని యజమాని వెటిరినరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీకి తీసుకొచ్చాడు. నొప్పి భరించలేక తన కాలుతో అదే తన్నుకుంటూ కనిపించడంతో ఆవు కడుపునొప్పితో బాధపడుతుందనే నిర్ధారణకు వైద్యులు వచ్చేశారు. కడుపులో ప్లాస్టిక్ ఉండటంతో దానివల్ల తీవ్ర వేదనకు గురైంది. అంతేకాదు ప్లాస్టిక్ కడుపులో ఉండటం వల్ల పాలు ఇవ్వడం కూడా దాదాపుగా తగ్గింది. మూత్ర విసర్జన సమయంలో కూడా చాలా ఇబ్బంది పడిందని యజమాని తెలిపాడు.
52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థంను గుర్తించిన వైద్యులు
ఇక వైద్యం చేసిన వైద్యులు ఈ సాధు జంతువు కడుపు నుంచి 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. సర్జరీకి 5 గంటల సమయం పట్టింది. ప్లాస్టిక్లను ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల ఎంతటి ప్రమాదాలు సంభవిస్తాయో అని చెప్పేందుకు ఈ గోవు ఘటనే నిదర్శనం అని యూనివర్శిటీ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కడుపులో ఆ ప్లాస్టిక్ పేరుకుపోవడానికి సుమారుగా రెండేళ్ల సమయం పట్టి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆవు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పిన వైద్యులు క్రమంగా కోలుకుంటోందని వెల్లడించారు.
ప్లాస్టిక్ తిని సొరచేపలు మృతి
జంతువుల కడుపులో ప్లాస్టిక్ వస్తువులు ఉండటం ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమై పోయిందని వైద్యులు చెబుతున్నారు. గతేడాది సముద్రంలో నివసించే భారీ సొరచేపలు ఆ సముద్రంలో మనిషి విసిరేసే ప్లాస్టిక్ సామగ్రిలను తిని మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.అంతేకాదు థాయ్లాండ్లో గ్రీన్ టర్టిల్ కూడా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులను తిని ప్రాణాలు పోగొట్టుకుంది. దీంతో జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించి జంతువుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.
ప్లాస్టిక్ నిషేధంపై పిలుపునిచ్చిన ప్రధాని
2018లో ప్లాస్టిక్ వస్తువులను ఆహారంగా తీసుకుని 1000 జంతువులు మృతి చెందాయని రాజస్థాన్ ప్రభుత్వం ఓ నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్లాస్టిక్ వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్లపై నిషేధం విధించాలంటూ ఆగష్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఈ మధ్యనే తమిళనాడులోని కోవలం బీచ్లో ప్లాస్టిక్ను తానే స్వయంగా తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో లేదని అక్టోబర్ 2న ప్రధాని మోడీ చెప్పారు.