అమిత్ షా భరోసా: మీ భద్రత మా బాధ్యత, షెహన్ షా హామీతో దిగొచ్చిన వైద్యులు, నో బ్లాక్ డే..
డాక్టర్లపై దాడులు చేయడాన్ని వైద్యులు సీరియస్గా తీసుకున్నారు. గురువారం దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటిస్తామని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్నింగ్తో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఐఎంఏ ప్రతినిధులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం నార్త్ బ్లాక్లోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ కూడా పాల్గొన్నారు.
Recommended Video
వైద్యులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అమిత్ షా వైద్యులకు తెలిపారు. ప్రభుత్వం మీతో ఉంది అని.. భద్రతకు బాధ్యత తమది అని అమిత్ షా స్పష్టంచేశారు. ఆపత్కాలంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. వైద్యుల భద్రతపై రాజీపడబోమని, వారికి భద్రత కల్పిస్తూనే గౌరవిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. సమావేశం తర్వాత అమిత్ షా ట్వీట్ చేశారు.
అమిత్ షా వినతికి వైద్యులు అంగీకరించారు. గురువారం తలపెట్టిన బ్లాక్ డేను విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐఎంఏ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నిరసనను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇటీవల మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహర్, బెంగళూరులో వైద్యసిబ్బందిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వైద్య సిబ్బందిపై జరుగుతోన్న దాడులపై అత్యవసర ప్రాతిపదికన చట్టాన్ని తీసుకురావాలని లేదంటే.. 23వ తేదీన బ్లాక్ డే పాటిస్తామని హెచ్చరించింది. దీంతో కేంద్రం దిగొచ్చి వారితో చర్చలు జరిపింది.