నీకేమైనా లైసెన్స్ ఇచ్చిందా: సచిన్పై రేణుకా చౌదరి సెటైర్
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్పై కాంగ్రెసు సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. టెండూల్కర్పై ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పార్లమెంటులో మాట్లాడడానికి భారత రత్న నీకు లైసెన్స్ ఇచ్చిందా అని ఆమె అడిగారు
తమ పార్టీ నేత మన్మోహన్ సింగ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పేంత వరకు సభను సజావుగా సాగనివ్వమని ఆమె అన్నారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆమె అన్నారు. గురువారంనాడు ఆ సంఘటన జరిగింది.
ఆ అంశంపై సచిన్ టెండూల్కర్
రైట్ టూ ప్లే అండ్ ఫ్యూఛర్ ఆఫ్ స్పోర్ట్స్ అనే అంశంపై సచిన్ టెండూల్కర్ ప్రసంగించాల్సి ఉండింది. కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో సభ నేటికి వాయిదా పడింది. సచిన్ ప్రసంగించే సమయంలో రేణుకా చౌదరి ఆ వ్యాఖ్యలు చేశారు.
సచిన్కు బిజెపి నేతల మద్దతు
బీజేపీ నేతలు సచిన్కు మద్ధతుగా నిలిచారు. ఓ దిగ్గజ క్రీడాకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని బిజెపి నేతలు అంటున్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలోనే సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
కేవలం 23 రోజులే సచిన్ హాజరు
సచిన్ ప్రమాణం చేసిన నాటి నుంచి మొత్తం 348 రోజులు సభ జరిగితే ఆయన కేవలం 23 రోజులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఆయనతోపాటే నామినేట్ అయిన నటి రేఖ 18 రోజులు మాత్రమే సభకు హాజరు కావటం విశేషం.
జయా బచ్చన్ ఇలా అన్నారు....
సచిన్పై వ్యాఖ్యలకు జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారత్కు సచిన్ పేరు తెచ్చిపెట్టారని, అటువంటి వ్యక్తిని మాట్లాడనీయకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని ఆమె అన్నారు. రాజకీయ నాయకులను మాత్రమే మాట్లాడనిస్తారా అని అడిగారు.
ఫేస్బుక్లో సచిన్ పోస్టు
రాజ్యసభలో గురువారంనాడు తాను ఏం చెప్పాలనుకున్నాననే విషయాన్ని గురువారం సచిన్ టెండూల్కర్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా చెప్పాడు. క్రీడలను ప్రేమించే దేశంగా పేరున్న భారతదేశాన్ని క్రీడలను ఆడే దేశంగా మార్చడం తన బాధ్యత అని ఆ వీడియో సందేశంలో ఆయన చెప్పాడు. తన ఈ కలను అందరి కలగా మార్చుకోవాలని, ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. తనకు క్రికెట్ అంటే ప్రాణమని, దాని గుర్తించి తనకు ఆడే స్వేచ్ఛను, హక్కును ఇచ్చిన తన తండ్రి రమేష్ టెండూల్కర్కు తానెప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు.