గాలి జనార్దన్ రెడ్డిని వెంటాడుతున్న దీపావాళి అమావాస్య కష్టాలు: చీకటి, అరెస్టులు!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో గతంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి దీపావళి అమావాస్య కష్టాలు గత ఏడు సంవత్సరాల నుంచి వెంటాడుతున్నాయి. దీపావళి అమావాస్యకు అటూ ఇటుగా గాలి జనార్దన్ రెడ్డి 2011 నుంచి చట్టపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీపావళి సమీపిస్తుంది అంటే గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు ఎప్పుడు ఎక్కడ అరెస్టు చేస్తారో అంటూ హడలిపోతున్నారు.
పోలీసు ఉద్యోగి కొడుకు
పోలీసు ఉద్యోగి కొడుకుగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న గాలి జనార్దన్ రెడ్డి అనూహ్యంగా గనుల వ్యాపారంలోకి అడుగు పెట్టి వేల కోట్లు రూపాయల లావాదేవీలు నిర్వహించి ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు సైతం గనుల వ్యాపారంలోకి అడుగు పెట్టి శ్రీమంతులు అయ్యారు.
రాజకీయాల్లో ఎంట్రీ
మైనింగ్ కింగ్ గా పేరు సంపాధించిన గాలి జనార్దన్ రెడ్డి మొదట తన సోదరులను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, ప్రాణస్నేహితుడు శ్రీరాములు బీజేపీ తీర్థం పుచ్చకుని అంచెలంచెలుగా ఎదిగారు. గాలి కరుణాకర్ రెడ్డి, శ్రీరాములు మంత్రులు అయ్యారు.
చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి
కర్ణాటకలో బీజేపీ మొదటి సారి అధికారంలోకి రావడానికి గాలి జనార్దన్ రెడ్డి శక్తివంచన లేకుండా పని చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డి చక్రం తిప్పారు. బళ్లారి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి తిరుగులేని నాయకుడు అయ్యారు. కర్ణాటక పర్యాటక శాఖా మంత్రిగా గాలి జనార్దన్ రెడ్డి పని చేశారు.
మొదటి సారి అరెస్టు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గాలి జనార్దన్ రెడ్డికి కష్టాలు మొదలైనాయి. 2011 సెప్టెంబర్ 5వ తేదీన దీపావళి పండుగకు 15 రోజుల క్రితం అక్రమ గనుల కేసులో బళ్లారిలోని కుటీర ఇంటిలో గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
బెయిల్ కోసం జడ్జిలకు లంచం
గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు అయిన రెండో సంవత్సరం దీపావళి పండుగకు ఆయన జైల్లో ఉన్నారు. 2012 దీపావళి పండుగ సందర్బంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తులకు ఆయన కుటుంబ సభ్యులు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తు అరెస్టు చేశారు. 2012 దిపావళి అమావాస్యకు గాలి జనార్దన్ రెడ్డికి మరన్ని సమస్యలు ఎదురైనాయి. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానాలు నిరాకరించాయి.
నాలుగో దీపావళి దెబ్బ
2011 నుంచి వరుసగా మూడు దీపావళి పండుగలకు అనేక సమస్యలు ఎదుర్కొన్న గాలి జనార్దన్ రెడ్డి నాలుగు సంవత్సరాల తరువాత షరతులతో కూడిన జామీనుతో జైలు నుంచి బయటకు వచ్చారు. 2011 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు గాలి జనార్దన్ రెడ్డి దూరంగా ఉన్నారు. 2018 దీపావళి పండగకు ఐదు రోజుల క్రితం ఆంబిడెంట్ కంపెనీ స్కాం కేసు గాలి జనార్దన్ రెడ్డిని వెంటాడింది. దీపావళి అమావస్య వెంటాడంతో గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. దీపావళి అమావాస్యకు గాలి జనార్దన్ రెడ్డికి అంతా అశుభం జరుగుతోందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.