2014 రిపీట్ కాదు, అసలు రక్షణ మంత్రి ఉన్నారా?: మోడీ ప్రభుత్వంపై శివసేన నిప్పులు
ముంబై: కేంద్రంపై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. పార్టీ 52వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ పత్రిక సామ్నాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీజేపీ ప్రభుత్వం దేశంలోని పలు రంగాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని పేర్కొంది. ఎన్డీయే నుంచి తాము బయటకు రావడం తథ్యమన్నారు. 2014 తిరగి పునరావృతం కాదని పేర్కొన్నారు. తద్వారా ఎన్డీయేతో కలిసి ముందుకెళ్లేది లేదని, మోడీని అధికారంలోకి రానిచ్చేది లేదని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, 2019లో సార్వత్రిక ఎన్నికల్లో కింగ్ మేకర్గా వ్యవహరిస్తామని పేర్కొంది. తమ పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకలా ఎప్పుడూ సాగలేదని, తమ మార్గంలో ఇప్పటికీ ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొంది. అయినా సరే అవరోధాలను అధిగమించి, వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి విజయం సాధిస్తామని పేర్కొంది. లోకసభ ఎన్నికల తర్వాత కూడా కీలక భూమిక పోషిస్తామని తెలిపింది.
దేశానికి రక్షణ మంత్రి ఉన్నారా?
అంతకుముందు రోజు కాశ్మీర్ అంశంపై శివసేన విమర్శలు గుప్పించింది. కాశ్మీర్లో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై సోమవారం మండిపడింది. మంత్రి పేరును ప్రస్తావించకుండా అసలు నిజంగా దేశంలో రక్షణ శాఖ మంత్రి ఉన్నారా? అని ప్రశ్నించింది.
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వాటి అధినేతలు హామీ ఇస్తుంటారని, తమకు వాటి మీద పూర్తి స్థాయి నమ్మకం ఉందని, కానీ వాటికి నాయకత్వం వహించే మంత్రికే ఎటువంటి నైపుణ్యాలు లేవని, అత్యంత బలహీనమైన, అసమర్థత కలిగిన వారు మనకు నాయకత్వం వహిస్తున్నారని, ఇది దేశానికి ఎంతో హానికరమని విమర్శించింది.
లేకుంటే ఉగ్రవాదులు రంజాన్ నెలలో ఓ సైనికుడిని హతమార్చడానికి అంత ధైర్యం రాదని పేర్కొంది. కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న ఔరంగజేబు అనే సైనికుడు రంజాన్ పండుగ జరుపుకోవడానికి ఇంటికి వస్తుండగా ఉగ్రవాదులు అతడిని అపహరించి, హతమార్చిన విషయం తెలిసిందే. ఔరంగజేబు దేశం కోసం పోరాడి అమరుడయ్యాడన్నారు.