ముఖ్యమంత్రిని వారే నిర్ణయిస్తారా?: బీజేపీ విషయంలో ఏం జరిగిందంటే?
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చి నాలుగు రోజులు అయింది. తెలంగాణలో తెరాస, మిజోరాంలో ఎంఎన్ఎఫ్ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో మెజార్టీ రాకపోయినప్పటికీ బీఎస్పీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఫలితాలు వచ్చి మూడు రోజులు దాటి నాలుగో రోజు చేరినా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేయలేకపోయింది.
మూడు రోజులుగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. రాజస్థాన్లో అశోగ్ కెహ్లాట్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్లో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా మధ్య పోటాపోటీ నెలకొని ఉంది. ఎట్టకేలకు గురువారం రాత్రి మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థిగా కమల్ నాథ్ పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. ఇంకా ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సీఎం అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్: రాహుల్ ట్వీట్కు జ్యోతిరాధిత్య సింధియా కౌంటర్
అలాంటి సందర్భాల్లో తెరపైకి ఆశావహులు
ఫలితాలు వచ్చి మూడు రోజులు అయినప్పటికీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థులపై నిర్ణయం తీసుకోలేకపోవడంపై చర్చ సాగుతోంది. ఆయా పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని ఖరారు చేయకుండా ఎన్నికలకు వెళ్లిన సందర్భాల్లో ఈ సమస్య తలెత్తుతుంది. ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పుడు పలువురు ఆశావహులు తెరపైకి వస్తారు.
బీజేపీకి కూడా ఇలాంటి సమస్య ఎదురైంది
ఇలాంటి పరిస్థితులను బీజేపీ కూడా ఎదుర్కొంది. మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ క్లిష్ట పరిస్థితిని కమలం పార్టీ ఎదుర్కొంది. ఎవరి పేరు ప్రకటించకుండానే అప్పుడు బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్పుడు పలువురు నేతలు తెరపైకి వచ్చారు. ఢిల్లీ వద్దకు క్యూ కట్టారు. దీనిని బీజేపీ సమర్థంగానే ఎదుర్కొంది.
పేరుకే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.. కానీ అధిష్టానానిదే నిర్ణయం
సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆయా పార్టీల లెజిస్లేటర్ పార్టీలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణ ప్రక్రియ. కానీ చాలా వరకు ఆయా పార్టీల్లో అధిష్టానం సూచించిన అభ్యర్థిని లెజిస్లేచర్ పార్టీలో ఎన్నుకుంటారు. తాము సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని అధిష్టానం చెబుతుంది. ఆయా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం సూచించిన అభ్యర్థికి ఓటు వేస్తారు. అలా ఆయా పార్టీల ఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటిస్తే... ఆ తర్వాత ఎమ్మెల్యేలు వారినే ఎ్నుకుంటారు.
ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపారు
గతంలో మహారాష్ట్రలో బీజేపీ గెలిచినప్పుడు సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు కూడా వినిపించింది. దీంతో గందరగోళం ఏర్పడింది. దానికి తోడు బీజేపీకి మహారాష్ట్రలో పూర్తి మేజిక్ ఫిగర్ రాలేదు. శివసేన అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గడ్కరీ ముఖ్యమంత్రిగా బెస్ట్ అని శివసేన భావించింది. పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గడ్కరీ అప్పుడు చెప్పారు. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలను బీజేపీ అధిష్టానం మహారాష్ట్రకు పంపించి, సమస్యను కొలిక్కి తెచ్చింది. ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ను ఎన్నుకున్నారు.
హర్యానాలోను బీజేపీకి ఇదే పరిస్థితి
హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టార్ను ఎన్నుకున్న సమయంలోను బీజేపీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. బీజేపీ గెలిచినప్పుడు పలువురు అభ్యర్థులు సీఎం రేసులో కనిపించారు. ఇక్కడ నాన్ జాట్ ఓటర్లు ఎక్కువ. వారిని పరిగణలోకి తీసుకొని జాట్ నేతను సీఎం అభ్యర్థిగా ఎంచుకోవద్దని భావించింది. అప్పుడు హర్యాన సీఎం రేసులో బీజేపీ నుంచి పాల్ గుజ్జర్, రావు ఇంద్రజిత్ సింగ్, రామ్ బిలాస్ శర్మ, ఖట్టార్లు ఉన్నారు. ఆ తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఖట్టార్ను సీఎంగా చేసింది. గుజ్జర్, సింగ్లు అప్పటికే కేంద్రమంత్రులుగా ఉన్నారు. అంతేకాకుండా సింగ్ ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు.
ఊహించని విధంగా యోగి ఆదిత్యనాథ్కు అవకాశం
యూపీలో బీజేపీ గెలిచినప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఏర్పడింది. యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు కేశవ ప్రసాద్ మౌర్య, రాజ్నాథ్ సింగ్ తదితరుల పేర్లు వినిపించాయి. కానీ ఊహించని విధంగా యోగి ఆదిత్యనాథ్ను సీఎం అభ్యర్థిగా నాడు బీజేపీ ఎంచుకుంది. ఇది దాదాపు ఎవరూ ఊహించలేదు. యోగి ఎంపిక ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాది అని తెలుస్తోంది. యూపీ ఎన్నికలకు ముందు రాజ్ నాథ్ సింగ్ అక్కడ బాగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆ తర్వాత గెలిచాక సర్వే నిర్వహించి యోగిని సీఎంగా చేశారు.