సోనియాను జైలుకు పంపాలని పివి అనుకున్నారా?
న్యూఢిల్లీ: ప్రధాని (పివి నరసింహారావు) తనను జైలుకు పంపించాలని అనుకుంటున్నారా అని ప్రస్తుత కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పట్లో ప్రశ్నించారంటూ అప్పటి కేంద్ర మంత్రి మార్గరెట్ ఆల్వా చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ ఆల్వా కరేజ్ అండ్ కమిట్మెం ట్ అనే పేరుతో రాసిన తన జీవిత చరిత్ర పుస్తకంలో ఆ విషయాన్ని వెల్లడించారు.
తన భర్త మాజీ ప్రధాని రాజీవ్గాంధీకి, తమ కుటుంబానికి మచ్చతెచ్చిన బోఫోర్స్ కేసు నుంచి తమను బయటపడేయడానికి బదులు ఆ కేసులో ఇంకా లోతుగా తమను ఇరికించేందుకు పీవీ ప్రధానిగా ఉన్నపుడు ప్రయత్నించారనేది పివిపై సోనియా ఆగ్రహానికి కారణమని ఆల్వా తెలిపారు.
1992లో బోఫోర్స్ కేసుకు సంబంధించిన ఒక పోలీస్ ఫిర్యాదును ఢిల్లీ హైకోర్టు కొట్టేసినా ఆ తీర్పుపై తిరిగి అప్పీలుకు వెళ్లాలని పీవీ ప్రభుత్వం నిర్ణయించడం సోనియాకు కోపం తెప్పించిందని రాశారు. "ఈ ప్రధాని నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? జైలుకు పంపాలనుకొంటున్నారా?" అని ఆ సందర్భంలో కలిసిన తనతో సోనియా అన్నారని ఆల్వా ఆ పుస్తకంలో రాశారు.
అప్పుడు ఆల్వా కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ మంత్రిగా, సీబీఐకి ఇన్చార్జ్గా ఉన్నారు. అయితే అప్పీలు విషయమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తనకు సంబంధం లేదని, ప్రధాని కార్యాలయం నుంచే నేరుగా ఆదేశాలు వెళ్లాయని వివరించడానికి అప్పుడు సోనియాను కలిశానని ఆల్వా తెలిపారు.
ప్రభుత్వం కేటాయించిన గృహం నుంచి తనను ఖాళీ చేయించేందుకు కూడా పీవీ ప్రభుత్వం యత్నించిందనేది సోనియా ఆగ్రహానికి మరో కారణమని అన్నారు. "ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఏం చేసింది? చంద్రశేఖర్ ప్రభుత్వం నాకు ఈ ఇల్లు కేటాయించింది. నా కోసం, నాపిల్లల మేలుకోసం ఫలానా పని చేయాలని నేను ఆయనను (అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీని) కోరడం లేదు" అని సోనియా తనతో అన్నట్లు ఆ పుస్తకంలో రాశారు.
సోనియా నిజంగానే పీవీపై ఎంతో ఆగ్రహంతో కనిపించారని రాశారు. రాజీవ్గాంధీ హత్యతో ప్రమేయం ఉన్నదని ఆరోపణలున్న ఆధ్మాత్మిక గురువు చంద్రస్వామితో సన్నిహితుడైనందుకు మాత్రమే కాకుండా ఎందుకో పీవీని సోనియా విశ్వసించలేకపోయారని తెలిపారు. తనతో సోనియా అన్న మాటలను తాను ప్రధాని పీవీకి చెప్పగా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని ఆల్వా తెలిపారు.
"నేనేం చేయాలని ఆమె (సోనియా) కోరుకుంటున్నారు? కోర్టుల్లో ఉన్న బోఫోర్స్ కేసును మూయించ లేను. కేసు కొనసాగుతుంది" అని ఆయన బదులిచ్చారని చెప్పారు. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ పుస్తకంలో ఆల్వా దుయ్యబట్టారు. ఇందిర సలహాదారులను ఆనాడు ఆమె కుమారుడు సంజయ్గాంధీ అవమానించారని తెలిపారు.
ప్రధానిగా రాజీవ్గాంధీ షాబానో ఉదంతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆల్వా వ్యతిరేకించారు. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించి, కేంద్రంలో పలుమార్లు మంత్రిగా పనిచేసిన మార్గరెట్ ఆల్వాను 2008లో పార్టీ పదవుల నుంచి తొలగించారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీకి ఆల్వా కుమారునికి కూడా కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేదు. తరువాతి కాలంలో ఆమెకు గవర్నర్ పదవి ఇచ్చారు.