భక్తులకు శునకం ఆశీర్వాదం... వీడియో వైరల్... ఎక్కడో తెలుసా...
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న సిద్ది వినాయక స్వామి ఆలయం వద్ద గత కొద్దిరోజులుగా ఓ శునకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలయానికి వచ్చి పోయే భక్తులను ఆ శునకం దాని చేయితో ఆశీర్వదిస్తోంది. సిద్ధటెక్ ప్రాంతానికి చెందిన అరుణ్ లిమాదియా అనే ఓ వ్యక్తి మొదట ఈ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేయగా... ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నిజానికి అదో వీధి కుక్క. ఉన్నట్టుండి ఇలా ఆలయం వద్ద ప్రత్యక్షమైంది. ఆలయం బయట మెట్లను ఆనుకుని వున్న స్టోన్ బ్లాక్పై కూర్చొన్నది. ఆలయంలో దైవ దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళ్లే క్రమంలో వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అలా తన ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న భక్తులకు చేయి ముందుకు చాచి షేక్ హ్యాండ్ ఇస్తోంది. కొంతమంది భక్తులకు తన చేయిని తలపై పెట్టి దీవెనలు కూడా ఇస్తోంది.
ఇది చూసిన కొంతమంది ఈ శునకం మహిమగలదని విశ్వసిస్తున్నారు. దాని ఆశీర్వాదం పొందితే మంచి జరుగుతుందని భావిస్తున్నారు. హిందూ సంప్రాదాయం ప్రకారం శునకాన్ని మల్లన్న దేవుడిగా కొలుస్తారన్న సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన చాలామంది దైవమే శునక రూపంలో వచ్చిందని నమ్ముతున్నారు. మరికొంతమంది ఈ వీడియోని చూసి...నిజమైన ఆశీర్వాదం అంటే ఇదే అని అభిప్రాయపడుతున్నారు.