కరోనా వైరస్ ను గుర్తించటంలో శునకాల సాయం: అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు
కరోనా మహమ్మారి నియంత్రించడం కోసం ప్రపంచం చేయని ప్రయత్నాలు లేవు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో నమూనాలను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఎలాంటి కరోనా నిర్ధారణ పరీక్షలు లేకుండా శునకాలు కరోనా వైరస్ ను గుర్తించగలవని, వాటికున్న ఘ్రాణశక్తి ద్వారా వైరస్ ను పూర్తి కచ్చితత్వంతో గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకు కావలసిన పలు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్తున్నారు.
కరోనా వైరస్ ను గుర్తించటం కోసం ప్రపంచ వ్యాప్తంగా శునకాలకు శిక్షణ
శునకాలు కరోనా వైరస్ ను గుర్తిస్తున్నాయి అని చెప్పిన శాస్త్రవేత్తలు, ఇప్పటికే ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. కరోనా వైరస్ ని గుర్తించడం కోసం ప్రపంచవ్యాప్తంగా శునకాలకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా వైరస్ కు సంబంధించిన వాసనను అవి పసిగట్టగలవని చెబుతున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో, ఎయిర్ పోర్ట్ లు, మార్కెట్లు వంటి ప్రాంతాలను వైరస్ ను గుర్తించేందుకు వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. అయితే శునకాల ద్వారా కరోనా వైరస్ ని గుర్తించడం పై ఇంకా శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను సమీక్షించని పరిస్థితుల కారణంగా తాజా ఫలితాలను నిర్ధారించే అవకాశం లేకుండా పోయింది.
ఇంటర్నేషనల్ కే9 బృందం పేరుతో ఆన్ లైన్ వర్క్ షాప్
ప్రస్తుతం వైరస్ ను గుర్తించేందుకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఖర్చు చేస్తున్న డబ్బుతో పోలిస్తే ఇది చాలా చవక అని అందరూ అంటున్నారు. నవంబర్ 3వ తేదీన ఇంటర్నేషనల్ కే9 బృందం పేరుతో నిర్వహించిన ఆన్ లైన్ వర్క్ షాప్ లో శునకాల ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చని హోల్గర్ వోల్క్ అనే వెటర్నరీ న్యూరాలజిస్ట్ పేర్కొన్నారు. వైరస్ గుర్తించే విషయంలో ఆయన శునకాలకు తర్ఫీదు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన శునకాల ద్వారా కరోనా వైరస్ ను గుర్తించడం సాధ్యమవుతుంది అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
లెబనాన్, ఫిన్లాండ్ దేశాల్లో
ప్రయాణికుల్లో కరోనా వైరస్ ను గుర్తించిన శునకాలు టెస్టులను చెయ్యవద్దు అనడం లేదు, కానీ శునకాలను కూడా వినియోగించుకుంటే చాలా నమ్మకమైన ఫలితాలు వస్తాయి అంటూ ఆయన పేర్కొన్నారు.ప్రయాణికుల్లో కోవిడ్ లక్షణాలు బయటపడక ముందే లెబనాన్, ఫిన్లాండ్ వంటి దేశాలలో శునకాలు వైరస్ ను గుర్తించినట్లుగా గణంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ తో విజృంభిస్తున్న క్రమంలో కరోనా వైరస్ ను గుర్తించడానికి చాలా మంది శాస్త్రవేత్తలు స్నిప్పర్ డాగ్స్ కు శిక్షణనిచ్చారు.
Recommended Video
స్నిఫ్ఫర్ డాగ్స్ తో ట్రయల్
ముఖ్యంగా కరోనా వైరస్ సోకిన వ్యక్తి చెమట మరియు, వారి అడుగుల ద్వారా కోవిడ్ ఇన్ఫెక్షన్లు గుర్తించేలా తర్ఫీదు ఇచ్చి యూఏఈ, లెబనాన్, ఫిన్లాండ్ విమానాశ్రయాల్లో స్నిఫ్ఫర్ డాగ్స్ తో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. లెబనాన్ దేశంలో 1680 మంది ప్రయాణికులను శునకాలు స్క్రీన్ చేయగా, వారిలో 158 కరోనా కేసులను గుర్తించాయి. శునకాలు గుర్తించిన వారిని పీసీఆర్ టెస్ట్ చేయగా వారికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా నియంత్రణ కోసం శునకాల వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వెటర్నరీ పరిశోధకులు చెప్తున్నారు.