మాట మార్చిన చైనా, సైన్యం పహరా కొనసాగిస్తోంది: డ్రాగన్
న్యూఢిల్లీ:డోక్లామ్ వివాదానికి పరిష్కారం లభిస్తోందని భావిస్తున్న తరుణంలో చైనా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద స్థలం నుండి రెండు దేశాలు సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రతిపాదనకు రెండు దేశాలు అంగీకరించినట్టు వార్తలు వెలువడిన గంటలోనే చైనా మరోసారి తన వక్రబుద్దిని వెల్లడించింది.
ఇండియా, చైనా మధ్య డోక్లామ్ వద్ద సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే రెండు దేశాల మధ్య వివాదానికి పరిష్కారం లభిస్తోందని ఇటీవలే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రకటించారు.
డోక్లాం వివాదం ముగిసిందనుకుంటున్న నేపథ్యంలో చైనా తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. డోక్లాం సమస్యకు పరిష్కారం కుదిరిందని, దౌత్య మార్గాల ద్వారా సరిహద్దు నుంచి సైన్యాన్ని ఇరు దేశాలు సైన్యాన్ని వెనక్కి పిలిపించుకునేందుకు అంగీకారం కుదిరిందని భారత విదేశాంగశాఖ ప్రకటించిన కాసేపటికే చైనా మరో ప్రకటన విడుదల చేసింది.
డోక్లాం నుంచి ఇండియా మాత్రమే సైన్యాన్ని ఉపసంహరించుకుందని, తమ సైన్యం మాత్రం అక్కడే ఉంటుందని పేర్కొంది. ఆ ప్రాంతంలో తమ సార్వభౌమాధికారం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో డోక్లాం వివాదానికి తెరపడిందని, దౌత్యపరంగా సమస్య పరిష్కారమైందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక ఈ వివాదం ముగిసిన ముచ్చటేనని పేర్కొంది. అయితే ఆ వెంటనే చైనా స్పందిస్తూ చైనా దళాలు సరిహద్దు వద్ద గస్తీ కాస్తాయని చైనా ప్రకటించింది.
తన ప్రాంతీయ సమగ్రతను కాపాడుకుంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ తెలిపారు. ఈ నెల 28న భారత్ డోక్లాం నుంచి తన బలగాలను ఉపసంహరించుకుందని ప్రకటించారు.
చైనా బలగాలు మాత్రం తమ దేశ సార్వభౌమాధికారం, చట్టబద్ధమైన హక్కులను కాపాడుకునేందుకు చర్యలు చేపడతాయంటూనే భారత్తో స్నేహపూర్వక సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.