చైనాపై పంతం నెగ్గించుకున్న భారత్: డొక్లాంలో ఇరుదేశాల సైన్యాలు వెనక్కి
రెండు నెలలకు పైగా భారత్, భూటాన్, చైనా సరిహద్దులోని డోక్లామ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూఢిల్లీ/బీజింగ్: రెండు నెలలకు పైగా భారత్, భూటాన్, చైనా సరిహద్దులోని డోక్లామ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించేందుకు సిద్దపడ్డాయి.
మేం భారత్లోకి చొచ్చుకు వస్తే రచ్చ, చేయడానికేం ఉండదు: చైనా కొత్త బెదిరింపు
చాలా రోజుల తర్వాత ఉద్రిక్త పరిస్థితి ఎట్టకేలకు సమసిపోయింది. ఇక్కడ మోహరించిన భారత్, చైనాల సైన్యం ఒకేసారి వెనక్కు మళ్లేలా ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం కుదిరింది.
ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకున్నామని పేర్కొంది. ఇక సాధ్యమైనంత త్వరగా సరిహద్దుల్లోని సైన్యాన్ని రెండు దేశాలూ వెనక్కు పిలుచుకోనున్నాయని తెలిపింది.
కాగా, చైనా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమవుతున్న సమయంలో ఈ వివాదం సమసిపోవడం గమనార్హం. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ చైనాకు వెళ్లనున్నారు.
కాగా, ఇప్పటికే చైనా, భారత్లు తమ సైన్యాలను వెనక్కు తీసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక నేడే మొత్తం సైన్యం వెనక్కు వస్తుందా? లేక దశలవారీగా వస్తుందా? అన్న విషయమై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. రెండు దేశాలూ ఒకేసారి సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదినుంచి డిమాండ్ చేస్తున్న భారత్, తన పంతాన్ని నెగ్గించుకోవడం విశేషం.