దేశీయ విమానాల పునరుద్దరణ.. కానీ ప్రయాణికుల్లో గందరగోళం.. అసలేం జరుగుతోంది..
దాదాపు 2 నెలల తర్వాత దేశవ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు సోమవారం(మే 25) నుంచి పునరుద్దరించబడ్డాయి. నేటి ఉదయం 4.45గంటలకు తొలి విమానం ఢిల్లీ నుంచి పుణేకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయానికి తొలి విమానం 7.45గంటలకు చేరుకుంది. విమాన సర్వీసుల పునరుద్దరణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఉదయాన్నే ఓ ట్వీట్ చేశారు. 'నేటి నుంచి దేశీ విమాన సర్వీసులను పునరుద్దరిస్తున్నాం. విమాన సర్వీసుల్లో భారత పౌర విమానయాన శాఖ ఎప్పుడూ ముందుంటుంది.' అని పేర్కొన్నారు. అదే సమయంలో చాలామంది ప్రయాణికులు విమాన సంస్థలు తమకు చెప్పా పెట్టకుండా విమానాలను రద్దు చేశాయని వాపోతుండటం గమనార్హం.
Recommended Video
పాక్ విమాన ప్రమాదం: కూలక ముందు సీసీ కెమరాల్లో రికార్డు.. పైలట్ చివరి మాటలు కూడా..!
ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాల రద్దు..
ఢిల్లీ,ముంబై,హైదరాబాద్ తదిరత విమానాశ్రయాల్లో ప్రయాణికులు విమాన సంస్థలు తమకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా విమానాలను రద్దు చేశారని వాపోతున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం(IGI) నుంచి ఈరోజు దాదాపు 80 విమానాలు నడవాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో వాటిని రద్దు చేశారు. ఇక ఎయిర్ ఇండియా బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణికులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విమానం రద్దు చేశారని చెప్పారు. తీరా బోర్డింగ్ పాసులు స్కాన్ చేశాక.. ఫ్లైట్ రద్దయినట్టు చెప్పారని.. దీంతో ఏం చేయాలో పాలు పోలేదని ఓ ప్రయాణికుడు ఏఎన్ఐతో వాపోయాడు. ముంబై ఛత్రపతి విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు కూడా తాను వెళ్లాల్సిన విమానం రద్దవడంతో షాకైనట్టు చెప్పాడు. దానిపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నాడు.ఇలా సరైన సమాచారం ఇవ్వకుండా విమానాలను రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్,బెంగాల్,ఏపీల్లో వాయిదా..
దేశీ విమాన సర్వీసులను అనుమతించే విషయంలో తర్జనభర్జన పడ్డ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమాన సంఖ్యలను తగ్గించింది. మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు 25 విమానాలను,ఇతర రాష్ట్రాల నుంచి ముంబైకి 25 విమానాలను మాత్రమే అనుమతించింది. తమిళనాడు ప్రభుత్వం చెన్నైతో పాటు మరో మూడు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఈ-పాస్ క్యారీ చేయడంతో పాటు 14 రోజులు క్వారెంటైన్లో ఉండాల్సిందేనన్న నిబంధన పెట్టింది. ఇక అంఫన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్లో విమాన సర్వీసుల పునరుద్దరణను మే 28కి వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ,విశాఖపట్నం విమానాశ్రయాల్లో సోమవారం ఎలాంటి విమాన సర్వీసులు ఉండవు. ఒకరోజు ఆలస్యంగా మంగళవారం నుంచి అక్కడ సర్వీసులను పునరుద్దరించనున్నారు.
మొత్తం 1050 విమానాలు..
విమాన ప్రయాణికులు ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి. విమానాశ్రయాల్లో వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ప్రయాణికుల లగేజ్ను కూడా స్క్రీనింగ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాలను మిస్ అవద్దని కొంతమంది ప్రయాణికులు ఢిల్లీ,ముంబై ఎయిర్పోర్టులకు ఆదివారం రాత్రే చేరుకున్నారు. వీళ్లలో చాలామంది లాక్ డౌన్ తర్వాత కుటుంబాలకు దూరంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారే. సోమవారం(మే 25) నాటి నుంచి మొత్తం 1050 విమానాలకు బుకింగ్స్ అందుబాటులో ఉంచారు.అయితే ఇందులో కొన్ని విమానాలు రద్దవడంతో ప్రయాణికులు నిరాశ చెందారు. ప్రస్తుతం అన్ని విమానయాన సంస్థలు మూడొంతుల్లో ఒక వంతు సామర్థ్యంతోనే విమానాలను నడుపుతున్నాయి.