హిందువులందరికీ చెప్తున్నా.. ముస్లింలను మీ ఇళ్లలోకి రానివ్వకండి: బీజేపీ ఎమ్మెల్యే
జైపూర్: ప్రజాప్రతినిధి అంటే అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ రాజస్థాన్ కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సింఘాల్ మాత్రం బహిరంగంగానే కొన్ని వర్గాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సింఘాల్.. తాజాగా ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఎవరూ తమ ఇళ్లలోకి రానివ్వరాదని వ్యాఖ్యానించారు. నేరాలు చేయడం వారికి ఒక అలవాటుగా మారిపోయిందని, అందుకే వారిని తన ఇంటిలోకి కాదు కదా ఆఫీసుకు కూడా రానివ్వని చెప్పారు.
Meo sect of Muslims never votes for #BJP. I also do not go to them for votes. Asking for votes from them would mean I would be compelled to help them in getting away with crimes they regularly commit. So I always stay away from them: BL Singhal, BJP MLA from Alwar. #Rajasthan pic.twitter.com/1yAuy91AQp
— ANI (@ANI) April 10, 2018
'మియో ముస్లింలు బీజేపీకి ఓటు వేయరు. నేను కూడా వాళ్లను ఓటేయమని అడగను. వాళ్లను ఓటు అడగడమంటే వాళ్లు చేసే నేరాలకు పరోక్షంగా సహకరించడమే. అందుకే ముస్లింలకు నేను వీలైనంత దూరంగా ఉంటా' అని సింఘాల్ కామెంట్ చేశారు.
గతంలో వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ లతో కలసి పనిచేసిన సింఘాల్.. ముస్లింలు గోవధ, లవ్ జిహాద్ వంటి నేరాలకు పాల్పడుతున్నారని అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, లవ్ జిహాద్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్వార్, భరత్ పూర్ నియోజకవర్గాల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న ముస్లింలు.. 'లవ్ జిహాద్' కోసం ప్రత్యేక ప్యాకేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మియో ముస్లింలకు ఇదొక ఆచారంలా మారిపోయిందన్నారు.
ఫేస్బుక్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి.. మియో ముస్లింలు హిందు అమ్మాయిలను ఆకర్షిస్తున్నారని సింఘాల్ ఆరోపించారు. హిందు అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారిని నరకంలోకి నెడుతున్నారని అన్నారు. మరోవైపు నిరక్షరాస్యులు, తక్కువ చదువుకున్న ముస్లిం అమ్మాయిలు సైతం హిందు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని అన్నారు.
ముస్లిం అబ్బాయిల ట్రాప్ లో హిందు అమ్మాయిలు పడవద్దని సింఘాల్ హెచ్చరించారు. 'హిందు అమ్మాయిలు టాలెంటెడ్, ఇంటలెక్చువల్ అయినప్పటికీ సెక్యులర్ గా ఉంటూ మియో ముస్లింలను సైతం పెళ్లి చేసుకుంటున్నారు.
కానీ పెళ్లయిన రెండేళ్లకే వారిని ముస్లిం భర్తలు గెంటేస్తున్నారు. అందుకే హిందు పెద్దలకు, కుటుంబాలకు చెబుతున్నా.. ముస్లింలను మీ ఇళ్లలోకి రానివ్వకండి, లవ్ జిహాద్ పట్ల అప్రమత్తంగా ఉండండి' అని సింఘాల్ చెప్పుకొచ్చారు.
కాగా, జనవరి నెలలో జరిగిన అల్వార్ లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ అక్కసుతోనే సింఘాల్ ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది.