సొంత పార్టీ ఎమ్మెల్యేపై మోడీ సీరియస్..! బ్యాటుతో మున్సిపల్ సిబ్బందిపై దాడి ఘటనపై స్పష్టమైన ఆదేశాలు
న్యూఢిల్లీ : ఇండోర్ మున్సిపల్ అధికారిపై బ్యాట్తో దాడిచేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియ తీరును ప్రధాని మోడీ ఖండించారు. ఆయన ఎవరైనా .. ఎవరి కుమారుడైనా చేసింది తప్పేనని స్పష్టంచేశారు. తప్పుచేసిన వారు శిక్షార్హులని .. ఇందులో మరో వాదనకు ఆస్కారం లేదని తేల్చిచెప్పారు మోడీ. గత నెల 26న ఆకాశ్ బ్యాటుతో తెగబడిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది.
దాడులను సహించబోం ..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గియ కుమారుడే ఆకాశ్ విజయ్ వర్గియ. బీజేపీలో ఉన్నత స్థానంలో తండ్రి ఉండటంతో .. తాను ఏం చేసినా చెల్లుతుందని భావించాడు ఆకాశ్. అందుకోసమే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవంతిని కూల్చివేస్తున్న సిబ్బందిపై ఏకంగా బ్యాటుతో దాడికి దిగాడు. ఈ దాడి తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరలవడం .. ఆకాశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం .. బీజేపీని ప్రతిపక్షాలు టార్గెట్ చేయడంతో ప్రధాని మోడీ .. బీజేపీ పార్లమెంటరీ పార్టీ వేదికగా స్పందించారు.
అలా ఎలా ..?
మున్సిపల్ సిబ్బందిపై ఆకాశ్ దాడిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రజాప్రతినిధి సహనం కోల్పోతే ఎలా అని ప్రశ్నించారు. ఓ నేత ఇలా ప్రవర్తించడాన్ని బీజేపీ ఆమోదించబోదని స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో భౌతిక దాడులు చేయడాన్ని సహించబోమని తేల్చిచెప్పారు. అంతేకాదు ఆకాశ్ ఎవరి కుమారుడైన సరే ఉపేక్షింబోమన్నారు మోడీ. అలాంటి వారి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారు .. ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ... దాడి చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందేనని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు. అంతేకాదు బెయిల్పై ఆకాశ్ విడుదలైన సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన వారి చర్యను కూడా మోడీ ప్రస్తావించారు. గాల్లోకి కాల్పులు జరిపిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు. బీజేపీ నేతుల, ప్రజాప్రతినిధులు .. ప్రజలతో, అధికారులతో సఖ్యంగా మెలగాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు అభిప్రాయపడింది. భౌతికదాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షింబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీ బోర్డులో తీసుకున్న నిర్ణయాలను తర్వాత మీడియాకు వివరించారు బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ.
ఏం జరిగిందంటే ..?
గత నెల 26న ఇండోర్ మున్సిపాల్ కార్యాలయం వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ హంగామా సృష్టించాడు. ఇండోర్ మున్సిపాలిటీ వద్ద అధికారిపై తిట్లపురాణం ప్రారంభించాడు. కోపం ఆపుకోలేక అక్కడే ఉన్న బ్యాటుతో దాడి చేశాడు. అతను దాడిచేస్తున్న సమయంలో ప్రజలు అక్కడే ఉన్నారు. అయినా ఏం బెదరకుండా తన పనిని పూర్తిచేశాడు. ఏం జరిగిందని అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆకాశ్ను అడగ్గా .. అధికారులు అక్రమంగా ఓ భవనాన్ని కూల్చివేశారని పేర్కొన్నాడు. ఆ భవనాన్ని కూల్చివేయాలని యాజమాని కార్పొరేషన్ కోరడం విశేషం. అయితే అందులో కొందరు నివసిస్తున్నారని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. ఇదే విషయం అడిగేందుకు ఫోన్ చేస్తే తన కాల్ లిప్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటువేసిన ప్రజలకు ప్రతినిధినని .. వారికి సంబంధించి బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. అయితే తనను మళ్లీ సంప్రదించకుండా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపగించుకున్న ఆకాశ్ .. మున్సిపల్ అధికారిపై చేయిచేసుకున్నాడు.