ఫేక్ ఫోటోలు షేర్ చేయొద్దు: సీఆర్పీఎఫ్, కాశ్మీరీలపై దాడి అంతా వట్టిదే.. అసత్య ప్రచారం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల డెడ్ బాడీలు అంటూ నకిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, కొందరు విద్వేషాన్ని ప్రచారం చేయాలని చూస్తున్నారని, అలాంటి ఫేక్ ఫోటోలతో వాటితో ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని, దయచేసి అలాంటి నకిలీ పోస్ట్లను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని, అలాంటి పోస్ట్లను గుర్తిస్తే సీఆర్పీఎఫ్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సీఆర్పీఎఫ్ తమ సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విటర్లో పేర్కొంది.
పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో యావత్ భారత్ ఆగ్రహంతో ఉంది. ఇలాంటి సమయంలో కొందరు ఉద్దేశ్యపూర్వకంగా దేశభక్తి ఉప్పొంగే ప్రజలను రెచ్చగొట్టి, అంతర్గత కలహాలు సృష్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తుంటారు. ఇలాంటివి జరిగితే కలహాలు చెలరేగుతాయి.
అందుకే వీటిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఆర్పీఎఫ్ హెచ్చరించింది. నకిలీ జవాన్ల ఫోటోలతో సోషల్ మీడియాలో షేర్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
అదే సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాశ్మీరీ విద్యార్థులపై కొందరు వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారనే వార్తలను కూడా సీఆర్పీఎఫ్ ఖండించింది. వేధింపులపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలించగా అందులో ఎలాంటి నిజం లేదని తేలినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. ప్రజల్లో ద్వేషం పెంచేందుకు కొందరు కావాలనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది.
దేశం మీద, జవాన్ల మీద విషంచిమ్మే వారు కొందరు దేశంలో ఉన్నారు. అలాంటి వారి తప్పుడు జవాన్ల మృతదేహాలను పోస్ట్ చేసి, దేశభక్తితో ఉప్పొంగే వారిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అలాగే, కాశ్మీరి యువతపై ఎలాంటి దాడులు, వేధింపులు లేకపోయినా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తద్వారా అమర జవాన్ల అంశాన్ని తక్కువ చేసి, కాశ్మీరీలపై దాడులు జరుగుతున్నాయని చెబుతూ దేశం మీద విషం చిమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.