అంబేడ్కర్ని ఓడించారు కదా: సోనియాకు శివసేన షాక్
న్యూఢిల్లీ: విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేయవద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం లోకసభలో అన్నారు. నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకొని రెండు రోజుల పాటు కేంద్రం అంబేడ్కర్ గౌరవార్థం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది.
గురువారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవరం కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యులు బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. మన ప్రవర్తనను దేశం మొత్తం చూస్తోందన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు.
మన ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సమగ్రంగా చర్చిద్దామని విపక్షాలను కోరారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం విపక్షాలకు తగదన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
బ్రిటీష్ పాలన సమయంలోనే దేశ పునర్నిర్మాణం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రజలకు స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరం కలసి ముందుకు సాగుదామన్నారు.
దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చిద్దామన్నారు. అంబేడ్కర్ సాధారణ కుటుంబం నుంచి పైకి వచ్చారని చెప్పారు. రాజ్యాంగం బలోపేతానికి ఎనలేని కృషి ఆయన చేశారన్నారు. జీవితంలో ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న మహానుభావుడు అన్నారు.
గురువారం నాడు లౌకికవాదంపై లోకసభలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్... కాంగ్రెస్ పార్టీకి, పరోక్షంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్కు చురకలు అంటించారు.
దేశంలో లౌకికవాదం అనే పదం బాగా దుర్వినియోగం అవుతోందని, ఈ దుర్వినియోగానికి ఇకనైనా ముగింపు పలకాలని రాజ్నాథ్ అన్నారు. సోనియా మాట్లాడాతూ... రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొనని వారు ఇప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తున్నారని బిజెపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ పైన శివసేన చేసిన వ్యాఖ్యలు సోనియా గాంధీకి గట్టి కౌంటర్ అయ్యాయి. శివసేన ఎంపీ ఆనంద్ రావు అడ్సుల్ మాట్లాడుతూ... స్వాతంత్రానంతరం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లు పాలించిందని, కానీ రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని ఆ పార్టీకి అనిపించక పోవడం విడ్డూరమన్నారు.
అంబేడ్కర్ను రాజ్యాంగ కమిటీ చైర్మన్గా చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని, కానీ అదే పార్టీ ఎన్నికల్లో ఆయనను పనిగట్టుకొని ఓడించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు రాజ్యాంగ దినోత్సవం జరపాలని ఎవరికీ రాలేదని, మోడీ ప్రభుత్వానికి ఆ ఆలోచన రావడం బాగుందని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.