సర్వీస్ చార్జి కడితేనే... లేకుంటే తినకండి: జాతీయ రెస్టారెంట్ల సంఘం, సందిగ్ధంలో కస్టమర్లు
హోటళ్ళు, రెస్టారెంట్లలో సేవలు నచ్చితేనే సర్వీస్ చార్జి కట్టాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు జాతీయ రెస్టారెంట్ల సంఘం (ఎన్అర్ఏఐ) మాత్రం సర్వీస్ చార్జీలు కడితేనే తమ హోటల్లో తినాలని.. లేకుంటే అల
న్యూఢిల్లీ: హోటళ్ళు, రెస్టారెంట్లలో సేవలు నచ్చితేనే సర్వీస్ చార్జి కట్టాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు జాతీయ రెస్టారెంట్ల సంఘం (ఎన్అర్ఏఐ) మాత్రం ససేమిరా అంటోంది. దీనిపై తాము న్యాయ పోరాటానికి సైతం సిద్ధమంటూ ప్రకటించింది.
దీంతో అటు ప్రధాని చెప్పింది చేయాలో ఇటు హోటళ్ళ గర్జనకు తలొగ్గాలో అర్థంకాక సగటు వినియోగదారుడు సందిగ్ధానికి గురువుతున్నాడు. మరోవైపు హోటళ్ళు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జి తప్పనిసరిగా కట్టాలని, లేకుంటే అక్కడ తినడం మానేయాలని ఎన్అర్ఏఐ ప్రకటించింది.
ఇటీవల పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా సర్వీస్ చార్జీల వసూలుపై అధికారులకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హోటళ్ళు, రెస్టారెంట్లలో వినియోగదారుడి సంతృప్తితో సంబంధం లేకుండా సర్వీస్ చార్జీలు వసూలు చేయరాదని.. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు "సేవలు నచ్చితేనే సర్వీస్ చార్జీలు కాతాలంటూ" హోటళ్ళు, రెస్టారెంట్లలో బోర్డులు పెట్టాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది కూడా.
అయితే తాము ఇప్పటికే వినియోగదారుల భద్రతా చట్టం అమలు చేస్తున్నామని, వినియోగదారుల నుంచి ఆమోదయోగ్యమైన చార్జీలే వసూలు చేస్తున్నామని ఎన్అర్ఏఐ అధ్యక్షుడు రియాజ్ అమ్లానీ పేర్కొన్నారు.
ఉద్యోగుల ఆదాయపన్ను, రెస్టారెంట్లకు వ్యాట్ మాదిరిగానే సర్వీస్ చార్జి కూడా బిల్లులో భాగంగానే కస్టమర్లు భావించాలని, సర్వీస్ చార్జీలు కడితేనే తమ హోటల్లో తినాలని.. లేకుంటే అలాంటి చార్జీలు లేని చోటికి వెళ్ళి తినాలని తాము వినియోగదారులకు సున్నితంగా చెబుతామని ఆయన వివరించారు.
"సర్వీస్ చార్జీలపై ఇంత గందరగోళానికి గురిచేసే బదులు కేంద్రం దీనిని పూర్తిగా రద్దు చేయవచ్చు కదా.." అని ఒక రెస్టారెంట్ యజమాని ప్రశ్నించారు. "భోజనమంతా బాగుంది.. కానీ సలాడ్ మాత్రం బాగోలేదు.." అని కస్టమర్ అంటే తమ పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు.
"కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖకు అందే ఫిర్యాడులన్నీ అదనపు పన్నుల గురించేగానీ సర్వీస్ చార్జీల గురించి కాదు... పన్నులయితే రద్దు చేయరుగానీ, కస్టమర్ ఇష్టపడి కట్టే సర్వీస్ చార్జీలు మాత్రం ఎత్తేస్తారా?" అని సదరు రెస్టారెంట్ యజమాని ప్రశ్నించారు.