12వ తరగతి పాసైన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోవద్దు: మోడీపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్
మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మహాకూటమి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ వైపు విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. 12వ తరగతి పాస్ అయిన వ్యక్తిని ప్రజలు దేశానికి ప్రధాని చేశారని... 2019 ఎన్నికల్లో అలాంటి తప్పిదం చేయకూడదని ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో నూటికి నూరుపాళ్లు అవినీతి జరిగిందని ఇందులో ప్రధాని మోడీ వాటా కూడా ఉందని కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు.
ఈ సారి ఆ తప్పిదం చేయకండి
"12వ తరగతి చదివిన వ్యక్తిని దేశ ప్రజలు ప్రధానిగా చేయడం వల్ల ఆయన ఎక్కడ సంతకాలు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోమారు ఆ తప్పిదం చేయకండి"అంటూ కేజ్రీవాల్ దేశప్రజలకు పిలుపునిచ్చారు. "తానాషాహి హఠావో లోక్తంత్ర బచావో" పేరుతో కేజ్రీవాల్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీయేతర నేతలు పాల్గొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడులు పాల్గొని మోడీపై ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడిన సందర్భంగా అగ్రనేతలైన మమతా బెనర్జీ, రాహుల్ గాంధీలు కామన్ మినిమమ్ ప్రొగ్రాంపై కలిసి పనిచేసేందుకు అంగీకారించారు.
నాటి పరిస్థితులే రిపీట్ అవుతాయి
నాడు యూపీఏ హయాంలో ఎలాగైతే అవినీతి ఆరోపణలు రావడంతో దేశమంతా ఒక్కతాటిపైకొచ్చి గత ప్రభుత్వాన్ని పెకిలించిందో.... అదే మాదిరిగా అవినీతి కూపంలో కూరుకుపోయిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ను కూడా ప్రజలు తరిమికొడతారని అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాలను అధిక ధరకు ప్రధాని కొనుగోలు చేశారని... కేవలం మోడీ మాత్రమే ఇందుకు బాధ్యత వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రాఫెల్ గురించి సత్యాలు దాయాలని చూస్తే ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పాకిస్తాన్లో లేదు...మీరు పాక్ ప్రధాని కాదు
రాజకీయ కక్షలో భాగంగానే విచారణ సంస్థలను మోడీ ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తిన కేజ్రీవాల్... ఢిల్లీ ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన ఏసీబీని లాక్కున్నారని వెల్లడించారు. ఏసీబీ కొందరు బడాబాబులపై కేసులు నమోదు చేస్తోందని అలాంటి విచారణ సంస్థను మోడీ లాక్కుని బడాబాబులకు రక్షణగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ భారత్లో భాగమే అని ప్రధాని గ్రహించాలని... మోడీ పాకిస్తాన్ ప్రధాని కాదని గుర్తుచేశారు. పాకిస్తాన్ ప్రధాని మాత్రమే ఢిల్లీని కాంగ్రెస్పై దాడులు చేస్తారని నొక్కి చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని ఏసీబీ కార్యాలయంపై దాడి చేస్తే తమ సత్తా ఏంటో చూపేవారమని... అయితే భారత ప్రధానిగా తమకు గౌరవం ఉందని అందుకే ఏమి చేయలేకపోతున్నామని చెప్పారు కేజ్రీవాల్. గత ఐదేళ్లుగా మోడీ-అమిత్ షా ద్వయం దేశంలోని మతసామరస్యాన్ని చెడగొడుతోందని ఫైర్ అయ్యారు.