గొడవలొద్దు: కేజ్రీవాల్కు జేపీ సుద్దులు, మోడీకి మార్కులు
హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ పని తీరు పైన జేపీ ఒకింత సంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఆ రాష్ట్ర అధికారులతో గొడవకు దిగడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందని జేపీ ఎద్దేవా చేశారు.
కేజ్రీవాల్ ప్రభుత్వం గొడవలు మాని ఎన్నికల హామీల పైన దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలన, ఆర్థిక నిర్వహణలో ఏ గ్రేడ్, స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీలపై బి గ్రేడ్, విద్యా, ఆరోగ్యం, స్థానిక సాధికారలో సీ గ్రేడ్ ఇవ్వవచ్చునన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జోలికి రావొద్దని లోక్సత్తా తెలంగాణ హెచ్చరించింది.
మోడీకి మేం సున్నా కూడా ఇవ్వం: సురవరం
కేంద్రంలో ఏడాది పూర్తి చేసుకున్న మోడీ సర్కారుకు తాము సున్నా మార్కులు కూడా ఇవ్వమని, తాము నెగిటివ్ మార్కులు ఇస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి అన్నారు.
ప్రధాని వాజపేయి ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు వినేవారని, మోడీ మాత్రం దానికి పూర్తి భిన్నంగా అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. తప్పుడు జవాబాలు రాసిన మాదిరిగా తప్పుడు విధానాలు తీసుకు వచ్చినందుకు మోడీకి వ్యతిరేక మార్కులు సబబే అన్నారు.
ప్రధాని నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనతో మాట్లాడటానికి ప్రజలు భయపడుతున్నారన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని కూడా వెంట తీసుకు వెళ్లకుండా ప్రధాని గోప్యంగా ఇతర దేశాల్లో యాత్రలు చేస్తున్నారన్నారు.