ఆయన మాట ఇలా: ట్రంప్ నిర్ణయాలపై ఆందోళన వద్దా...
ట్రంప్ నిర్ణయాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదా.. ఆ అవసరం లేదని విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ అంటున్నారు.
న్యూఢిల్లీ:హెచ్ 1బి వీసా విధానంలో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని, వీటిపై ఆందోలన చెందాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మూడు అనధికారిక బిల్లులకు ఉభయ సభల కాంగ్రెస్ ప్రక్రియలో ఎలాంటి ప్రతిస్పందన వస్తుందన్నదానిపై ముందస్తుగా ఎలాంటి నిర్ణయాలకు రాలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ గురువారం స్పష్టం చేశారు.
ఈ బిల్లులను అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టినంత మాత్రాన వాటికి ఆమోదం లభించినట్టు కాదని ఆయన అన్నారు. గతంలో కూడా ఇలాంటి బిల్లులను అమెరికా చట్టసభల్లో ప్రవేశ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వీటిపై ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు జారీ అయ్యే పక్షంలోనే భారత్ ప్రతిస్పందిస్తుందని, అంత వరకూ ముందస్తుగా ఎలాంటి నిర్ణయాలకూ రావడం కుదరదని అన్నారు.
అయినా వీసాల అంశంపై ట్రంప్ ప్రభుత్వంతోనూ, అమెరికా కాంగ్రెస్ సీనియర్ అధికారులతోనూ భారత్ సంప్రదింపుల జరుపుతూనే ఉంటుందని వివరించారు. భారత సాఫ్ట్వేర్ ఎగుమతుల పరిమాణం, అమెరికా సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధిలో భారత నిపుణుల పాత్ర గురించి అక్కడి ప్రభుత్వానికి పూర్తిగా తెలుసునని వికాస్ స్పష్టం చేశారు.
డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై భారత ఉద్యోగులు, విద్యార్థులు, ముఖ్యంగా టెక్కీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.