మాల్యా రుణాలపై ఎలాంటి రికార్డులులేవు: సీఐసీకి తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: దేశంలోని పలు బ్యాంకులకు సుమారు 9వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రుణాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ శాఖే కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కి చెప్పడం గమనార్హం.
మాల్యా రుణాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ రాజీవ్ కుమార్ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఆ వివరాలు తాము ఇవ్వలేమని ఆర్థికశాఖ పేర్కొంది. వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వకుండా ఆర్టీఐ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయని తెలిపింది. దీంతో రాజీవ్ సీఐసీని ఆశ్రయించారు.
ఈ క్రమంలో సీఐసీ ప్రశ్నించగా.. మాల్యా రుణాలకు సంబంధించిన రికార్డులేవీ తమ వద్ద లేవని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. దరఖాస్తుదారుడు కోరుతున్న సమాచారం ఆయా బ్యాంకులు లేదా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉండొచ్చని పేర్కొంది. అయితే, మాల్యా వివరాలు తమ వద్ద లేవని చెబుతున్న ఆర్థికశాఖ గతంలో ఈ వివరాలను పార్లమెంట్లో ప్రస్తావించడం గమనార్హం.
కాగా, ఆర్థికశాఖ సమాధానంపై సీఐసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టప్రకారం.. 'ఇది అస్పష్టమైన, అస్థిరమైన జవాబు' అని పేర్కొంది. వెంటనే రాజీవ్ దరఖాస్తును సంబంధిత పబ్లిక్ అథారిటీకి బదిలీ చేయాలని సూచించింది.