‘లెక్చర్లు తగ్గించుకో..’, యోగికి సిద్ధరామయ్య చురకలు!
బెంగళూరు: ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన స్వరాన్ని మరింత పెంచారు. 'లెక్చర్లు తగ్గించుకోండి..' అంటూ ఆ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు చురకలు వేశారు.
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించే బీజేపీ ప్రముఖుల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం సిద్ధరామయ్య.. 'ఒక సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను కూడా కోల్పోయిన బీజేపీ తీవ్ర అవమానంతో తల్లడిల్లుతోంది. చారిత్రాత్మక విజయం సాధించిన సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలకు నా అభినందనలు. బీజేపీయేతర పార్టీల ఐక్యత చాలా కీలక పాత్ర పోషించింది..' అంటూ ట్వీట్ చేశారు.
అదేసమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించి.. 'ఉపన్యాసాలు ఇవ్వడం తగ్గించుకుంటే ఆయనకే మంచిది..' అంటూ విమర్శించారు. ముందు యోగి ఉంటున్న ప్రాంతం అభివృద్ధి గురించి పట్టించుకోవాలని హితవు పలికారు.
అంతానికి ఆరంభం?: ఉప ఎన్నికల్లో బోల్తా పడుతున్న బీజేపీ.. 23లో గెలిచింది నాలుగే!
త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకపై కూడా కన్నేసింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో విజయం అనంతరం ఇక తమ దృష్టి కర్ణాటకపైనే అని బీజేపీ పెద్దలు బహిరంగంగానే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగడం, పైగా దాదాపు 30 ఏళ్లుగా ఆధిపత్యం కొనసాగించిన స్థానాల్లోనే బీజేపీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరోవైపు బీజేపీ పరాజయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.