నాకు ఆ ముస్లింల ఓట్లు అక్కర్లేదు- అసోం ఎన్నికల వేళ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
అసోం శాససనభకు ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్సార్సీ, సీఏఏ చట్టాల అమలు నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీజేపీకి అక్కడ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా స్ధానికులు కాదన్న సాకుతో లక్షలాది మందిని ఇబ్బందుల పాలు చేసిన బీజేపీకి ఓటర్లు ఈసారి బుద్ధి చెప్పబోతున్నారన్న వార్తల నేపథ్యంలో అసోం బీజేపీ నేత, మంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
ఈసారి అసోంలో జరిగే ఎన్నికల్లో బెంగాల్ నుంచి వలస వచ్చిన మియా ముస్లింల ఓట్లు బీజేపీకి అక్కర్లేదని రాష్ట్రమంత్రి, పార్టీ కీలక నేత హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. వారు ముస్లింల్లో అతివాదులని ఆయన పేర్కొన్నారు. మియా ముస్లింలు అస్సాం సంస్కృతిని, భాషను, భిన్నత్వంలో ఏకత్వాన్ని వారు బహిరంగంగానే సవాల్ చేస్తున్నారని హిమంత ఆరోపించారు. తమను తాను మియాలుగా చెప్పుకుంటున్న వీరంతా అసోం సంస్కృతి, భాషకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.
అందుకే తాను మియా ముస్లింల ఓట్లతో ఎమ్మెల్యే కావాలనుకోవడం లేదని, వారు వేసిన ఓట్లతో అసెంబ్లీలో కూర్చోలేనంటూ రాష్ట్రమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో సైతం కలకలం రేపాయి. తమను తాను మియాలుగా చెప్పుకుంటున్న వీరికి రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ టికెట్లు ఇవ్వబోదని, కాంగ్రెస్ కూడా టికెట్లు ఇవ్వొద్దని హిమంత సూచించారు. మియా ముస్లింలకు బహిరంగంగానే మద్దతు పలుకుతున్న ఏఐయూడీఎఫ్తో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. దీంతో ఈ కూటమి బీజేపీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని హిమంత చెప్తున్నారు.