ఆ అంశాలకు కోడ్ వర్తించదు. స్పష్టం చేసిన ఈసీ
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ మిషన్ శక్తికి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రకటనతో మోడీ కోడ్ను ఉల్లంఘించారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతుండటంతో ఎట్టకేలకూ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. దేశ రక్షణకు సంబంధించిన ప్రకటనలకు ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టంచేసింది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే ప్రధాని ప్రకటించారని దానికి కోడ్ అడ్డురాదని ఈసీ స్పష్టం చేసింది.
మిషన్ శక్తి.. ఇదో శాటిలైట్ కిల్లర్
సూపర్ సైన్స్ పవర్గా భారత్
ప్రధాని మోడీ ప్రసంగంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మోడీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేవలం ఎకనమిక్ పవర్గానే కాకుండా సూపర్ సైన్స్ పవర్గానూ భారత్ అవతరిస్తోందని ప్రశంసించారు.
శక్తిమిషన్ యూపీఏదేనన్న అహ్మద్ పటేల్
భారత్ ప్రయోగించిన యాంటీ శాటిలైట్ వెపన్ ఘనత యూపీఏ ప్రభుత్వానిదే కాంగ్రెస్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ హయాంలో యాంటీ శాటిలైట్ వెపన్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గుర్తుచేశారు. మాజీ ప్రధాని మన్మోసింగ్ దూరదృష్టిని కొనియాడిన ఆయన, ప్రయోగంలో పాల్గొన్న సైంటిస్టులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం
ప్రధాని ప్రకటనను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించారు. నిరుద్యోగం, మహిళా భద్రత తదితర సమస్యల నుంచి మోడీ ఓ గంటపాటు యావత్ దేశం దృష్టిని మరల్చడంలో సఫలమయ్యారని సటైర్ విసిరారు. మిషన్ శక్తి విజయంలో పాలుపంచుకున్న డీఆర్డీఓ, ఇస్రో సైంటిస్టులకు అఖిలేష్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.