ఇలాగా, బిజెపి మాట్లాడొద్దా: కాంగ్రెస్కి ములాయం షాక్
న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. సభ నడవాలని, కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటే ఏ విషయంలోను మేం మద్దతిచ్చే ప్రసక్తి లేదని, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా అడ్డుపడవద్దని కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ములాయం తేల్చి చెప్పారు.
ఇక చాలు ఆపండి లేదంటే ఒంటరిగా మిగిలిపోతారని ములాయం కాంగ్రెస్ పార్టీని ఘాటుగానే హెచ్చరించారు. పార్లమెంటు సభల్లో ఆందోళనను విరమించి ప్రజా సమస్యలు చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని లేదంటే తాము మద్దతు ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పారు.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి వ్యతిరేకంగా సభలను స్తంభింప చేస్తోంది. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా.. బిజెపి ససేమీరా అంటోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ సమావేశాలను అడ్డుకుంటోంది. దీనిపై ములాయం ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సభను ఇలాగే అడ్డుకుంటే తాము మద్దతు ఉపసంహరించుకుంటామన్నారు. పార్లమెంటులో చర్చకు రావాల్సిన విలువైన అంశాలు వేదిక మీదకు రావడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిరంతర నిరసనను తాము ఖండిస్తున్నామని, సభ సాఫీగా సాగాలని చెప్పారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. విపక్షాలన్నింటితో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటన అబద్దమన్నారు. ఎస్పీతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీ, జెడీయు కూడా షాకిచ్చాయి.