నో టు ‘బెగ్’: రాజ్యసభలో తన మార్క్ చూపిన వెంకయ్య
Recommended Video
న్యూఢిల్లీ: తాను ఎక్కడ ఉన్నా.. ఎక్కడికెళ్లినా తన మార్క్ చూపించడం ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకత. ఆయన మాటలు, చేతలు ఆసక్తికరంగా ఉండటంతోపాటు ఆలోచింపజేస్తాయి.
తాజాగా రాజ్యసభలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రాజ్యసభలో ఛైర్మన్ అయిన వెంకయ్యనాయుడు సభ్యులకు కీలక సూచనలు చేశారు.
ఆ పదం వాడొద్దు
ఇప్పటి వరకు రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ‘ఐ బెగ్ టు' అని పలికేవారు. సభ్యులు ఇకపై ఆ పదాన్ని వాడొద్దని వెంకయ్యనాయుడు సూచించారు. అది వలసవాదానికి నిదర్శనమని, ప్రస్తుతం మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని వెంకయ్య స్పష్టం చేశారు.
ఐ బెగ్ టు..
పార్లమెంట్ శీతకాల సమవేశాల ప్రారంభం సందర్భంగా తొలిరోజు రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఈ సూచన చేశారు. పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు కొందరు ఐ బెగ్ టు (నేను వేడుకుంటున్నా) అనే పదాన్ని వాడటం చూసిన వెంకయ్య ఈ సూచన చేశారు.
దానికి ఈ పదం వాడండి..
‘నేను వేడుకుంటున్నాను' అనే మాటలను మర్చిపోవాలని, ఆ పదం స్థానంలో ‘నేను లేవనెత్తుతున్నాను' అనే మాటను ఉపయోగించాలని సూచించారు. అయితే, ఇది తన సలహా మాత్రమేనని, ఆదేశం కాదని సభ్యులకు తెలిపారు.
వెంకయ్య ప్రత్యేకమే
అంతేగాక, మృతిచెందిన సభ్యులకు సంతాప ప్రకటన సందర్భంలోనూ సభలో వెంకయ్య నిల్చోవడం కనిపించింది. అంతకుముందు ఛైర్మన్లుగా వ్యవహరించిన హమీద్ అన్సారీ, భైరాన్ సింగ్ షెకావత్ మాత్రం కూర్చునే ఉండేవారు. అటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా సంతాప ప్రకటన సమయంలో నిల్చుంటుండటం గమనార్హం.