నేరం చేసినవారు ముస్లింలు అయినా సరే..వదలద్దు: మమతకు ముస్లిం పౌరుల లేఖ
కోల్కతా: కోల్కతాలో జరుగుతున్న దారుణాలకు ముస్లిం సామాజికి వర్గానికి చెందిన వ్యక్తులే కారణమనే ఆరోపణలు వస్తుండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్దలు స్పందించారు. శాంతిభద్రతలకు ముస్లిం సామాజిక వర్గం వారు విఘాతం కలిగించినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే వారిపై విచారణ జరిపి నేరం చేసినట్లు తేలితే కఠినంగా శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన రెండు ఘటనల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లు బయటకు రావడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక డాక్టరుపై దాడి చేసిన ఘటనలో మరో వైపు మాజీ మిస్ ఇండియా యూనివర్స్ ఉషోషి సేన్గుప్తాపై వేధింపుల కేసులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారిపై ఆరోపణలు వచ్చాయి.
ఇక ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మమతా సర్కార్ ముందు రెండు దారులున్నాయన్నారు. ఆరోపణలు వచ్చిన వారిని ముందుగా అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని చెప్పారు. ఈ రెండు ఘటనల్లోనే కాకుండా ప్రతి చిన్న ఘటనలో తమ వర్గంవారిపై ఆరోపణలు వస్తే ముందుగా అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ముస్లింలు కాబట్టి వారిని వదలకూడదని కూడా లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ ఆరోపణలు వచ్చిన వారిని వదిలితే ముస్లింలను మమతా సర్కార్ కాపాడుతోందన్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని వారు తెలిపారు.
ఇక రెండోదిగా... కోల్కతాలో ఉన్న ముస్లిం యువతకు అవగాహన కల్పించాలని చెప్పారు.శాంతి భ్రదతలకు విఘాతం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సూచించారు. తోటి పౌరుల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పాలని మమత ప్రభుత్వాన్ని మతపెద్దలు కోరారు. ఇక చాలామంది ముస్లింలు కూడా అన్యాయంగా బలయ్యారంటూ తెలుపుతూ వారి పేర్లను లేఖలో రాసి లేఖను ముగించారు. క్యాబ్లో వచ్చిన మాజీ మిస్ ఇండియా యూనివర్శ్ ఉషోషిసేన్గుప్తాను కొందరు వెంబడించి వేదించారనే కేసు నమోదు చేసిన తర్వాత ఈ లేఖను ప్రభుత్వానికి రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెకు జరిగిన ఘటన వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటి వరకు ఏడుమందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.