కరోనా మహమ్మారిని తేలిగ్గా తీసుకోవద్దు, అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోండి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తేలిగ్గా తీసుకోకూడదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. దేశ ప్రజలంతా కరోనా బారినపడకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. గురువారం బీహార్ రాష్ట్రంలో రూ. 20,050 కోట్లతో ప్రధానమంత్రి మత్య్స సంపద యోజనతోపాటు పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు.
రెండు కీలక పథకాలు..
మత్య్సకారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడతుందన్నారు. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో దేశం చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది శ్వేత విప్లవం లాగా తీపి విప్లవానికి పునాది వేస్తుందన్నారు. కాగా, పాల రైతుల కోసం ఈ గోపాల అనే మొబైల్ యాప్ను కూడా ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఈ గోపాల యాప్ ద్వారా పాల ఉత్పత్తిదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి..
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని.. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసేవరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కులు ధరించాలని, కనీసం రెండు గజాల దూరం పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదని సూచించారు. కుటుంబంలోని వయో వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
Recommended Video
భారీగానే కేసులు.. రికవరీ ఎక్కువే.. మరణాలు 2శాతం లోపే
కాగా, దేశంలో బుధవారం ఒక్కరోజే 11,29,756 నమూనాలను పరీక్షించగా.. 95,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,65,863కు చేరింది. కరోనా బాధితుల్లో 34,71,784 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 75,062 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 9,19,018 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 77.7శాతం ఉండగా, మరణాల రేటు 1.7శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,29,34,433 నమూనాలను పరీక్షించారు. అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి.