టాయ్లెట్ లోకి ఫోన్ కూడా తీసుకెళ్తున్నారా?: డేంజర్ అంటున్న శాస్త్రవేత్తలు..
స్మార్ట్ ఫోన్ టాయిలెట్ లోకి తీసుకెళ్లడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Recommended Video
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితాల్లో చాలా స్పేస్ ఆక్రమించుకుంది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలామందికి కష్టమే.
ఆఖరికి టాయిలెట్కి వెళ్లినా సరే, మొబైల్ ఫోన్ను వెంట తీసుకెళ్తున్నారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల డయేరియా, మూత్ర సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన డా.పాల్ అనే మైక్రోబయాలజిస్ట్ చెబుతున్నారు.
టాయ్లెట్లో ఉండే సింకులు, నల్లాలు, బేసిన్ల మీద ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగకారక బాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు. ఆ బాక్టీరియా స్మార్ట్ ఫోన్ల మీదకు చేరి శరీరంలోకి ప్రవేశించే అవకాశముందంటున్నారు. పడుకునేటప్పుడు సైతం ఫోన్ పక్కనే పడుకుంటారు కాబట్టి.. ఏదో ఒక సందర్భంలో దాని నుంచి బాక్టీరియా శరీరంలోకి చేరుతుందంటున్నారు.
బ్యాగులను శుభ్రం చేయకపోవడం, బూట్లను ఇంటి లోపల ధరించడం, విప్పడం, టీవీ రిమోట్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా హానికారక బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.