రిపబ్లిక్ డే ఘటనలపై దర్యాప్తు కోసం పిటిషన్ల వెల్లువ- జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రిపబ్లిక్ డే రోజున రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో భారీ ఎత్తున హింస చోటు చేసుకుంది. ఇందులో పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ సహా పలువురి పాత్ర ఉందని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. మరోవైపు పార్టీల మధ్య కూడా రాజకీయంగా మాటల యుద్ధం సాగుతోంది. దీంతో ఢిల్లీ హింసపై దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయి.
రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనలపై దర్యాప్తు కోరుతూ దాఖలవుతున్న పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్.ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్తో కూడిన త్రిసభ్య బెంచ్ ఈ వాజ్యాలపై స్పందించింది. ఈ పిటిషన్లపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు స్పష్టం చేసింది. దీనిపై చర్యలు కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఘటనలపై దర్యాప్తు జరుపుతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారని సుప్రీం ధర్మాసనం పిటిషనర్లకు గుర్తు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా చూపుతున్న మీడియాకు అడ్డుకట్ట వేయాలంటూ అడ్వకేట్ మనోహర్లాల్ శర్మ దాఖలు చేసిన మరో ప్రజాప్రయోజన వాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రైతుల ఆందోళల్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన తన పిటిషన్లో ఆరోపించారు.