మొత్తం సినిమా అయిపోయేటప్పటికీ దేశం దివాళా తీస్తుందేమో: మోడీపై కౌంటర్ అటాక్
న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే తాము అవినీతిపరులను జైలుకు పంపించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపించామని, ఆర్థిక నేరస్తులు మరింతమందిని అరెస్టు చేస్తామని మోడీ హెచ్చరించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురు దాడికి దిగారు. నరేంద్ర మోడీ సినిమా మొత్తం చూపించే సరికి దేశం దివాళా తీయడం ఖాయమని అన్నారు. మొత్తం సినిమాను చూడటానికి తాము సిద్ధంగా చెప్పారు. కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోడీ సినిమాగా చూపించబోతున్నారా? అని నిలదీశారు.
చిదంబరం అరెస్టు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని నరేంద్ర మోడీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటైన బహిరంగ సభలో హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ తీవ్రంగా స్పందించారు. నరేంద్ర మోడీ 100 రోజుల పాలనలోనే ఆర్థిక మాంద్యం దేశాన్ని చుట్టుముట్టిందని, జీడీపీ దిగజారిందని అన్నారు. దేశంలో అతి పెద్ద వాహన తయారీ సంస్థలు ఒక్కటొక్కటిగా తమ సెలవు దినాలను పొడిగించుకుంటున్నాయని గుర్తు చేశారు. ట్రైలర్ లోనే ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారైతే.. సినిమా మొత్తం ముగిసేటప్పటికి దేశం దివాళా తీసేలా ఉందని చెప్పారు. మొత్తం సినిమాను చూడాలని అనుకోవట్లేదని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్లు సంధించారు.
PM : 100 days a trailer , film to Abhi baki hai
— Kapil Sibal (@KapilSibal) September 13, 2019
Down
1) GDP 5%
2) Revenue collections up 1% ( down from 22% last year )
3) consumption
5) Auto sales ( 10th straight month )
6) GST collections
7) Investments
UP
Unemployment : 8.2%
Hamein baki film nahin dekhni !
మోడీ తొలి 100 రోజుల పాలనలో దేశ స్థూల జాతీయోత్పత్తి అయిదు శాతానికి దిగజారిందని అన్నారు. ప్రభుత్వ ఆదాయం గత ఏడాదితో పోల్చుకుంటే ఒక శాతం క్షీణించిందని చెప్పారు. దేశ ప్రజల అవసరాలు, రోజువారి వినియోగంలో సైతం పడిపోయిందని అన్నారు. వాహనాల అమ్మకాలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. వరుసగా పదో నెలలోనూ వాహనాల అమ్మకాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా క్షీణించాయమని చెప్పారు. జీఎస్టీ రూపంలో అందే ఆదాయం తగ్గుముఖం పట్టిందని, పారిశ్రామిక రంగం మందగించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు పెట్టుబడిదారులను భయాందోళనలకు గురి చేస్తున్నాయని చెప్పారు. ఫలితంగా- పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావట్లేదని అన్నారు. నిరుద్యోగం 8.5 శాతానికి పెరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ఇవే పరిస్థితులు అయిదేళ్ల పాటు కొనసాగితే.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమని, దాన్నే మోడీ సినిమాగా చూపించబోతున్నారా? అని చురకలు అంటించారు.