వచ్చే రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా డొనాల్డ్ ట్రంప్!
న్యూఢిల్లీ: అమెరికాతో మరింత సత్సంబంధాలు కొనసాగించేందుకు వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను భారత్ ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్లోనే ట్రంప్కు ఆహ్వానం పంపించిందని, దీనిపై ట్రంప్ యంత్రాంగం సానుకూలంగా స్పందించిందని సమాచారం.
భారత్ ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైతే.. ట్రంప్ ఈ వేడుకకు హాజరైన రెండో అమెరికా అధ్యక్షుడు అవుతారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.
అమెరికా ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై సుంకం పెంచుతూ వాణిజ్య యుద్ధానికి తెర లేపడం, ఇరాన్ నుంచి చమురు దిగుమతిని ఆపేయాలని భారత్ను అమెరికా హెచ్చరిస్తున్న సమయంలో ట్రంప్ను ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల అమెరికా, భారత్ల మధ్య జరగాల్సిన 2+2 చర్చలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
కాగా, గత గణతంత్ర దినోత్సవ వేడుకలకు పది ఏషియాన్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసమే భారత్ వారిని ఆహ్వానించింది.