ఇండియా సకల కళల పుట్ట.. సౌభ్రాతృత్వంలో దిట్ట.. భారత సంస్కృతిని కొనియాడిన ట్రంప్..!!
మోతెరా/హైదారాబాద్ : రెండు రోజుల పర్యటన కోసం భారత దేశం వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశ గొప్పదనాన్ని చాటి చెప్పారు. నమస్తే ట్రంప్ పేరుతో గుజరాత్ లోని మోతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ స్తూర్తిదాయక ప్రసంగం చేసారు. భారత దేశంలోని అన్ని రంగాలను మేళవిస్తూ, ఆయా రంగాల్లో అత్యున్నత ప్రతిభా పాటవాలు చూపించిన వ్యక్తుల పేర్లను కూడా ట్రంప్ ప్రస్తావించడం విశేషం. టీ అమ్ముకునే వ్యక్తి రాజకీయ రంగంలో అత్యన్నత శిఖరాలను ఎలా అధిరోహించారో వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తారు ట్రంప్. దీంతో మోతెరా స్టేడియం కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది.
Recommended Video
మోతెరాలో మోతపుట్టించిన ట్రంప్..
మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం మోతెరా స్టేడియంలో కూర్చున్న సుమారు లక్షమంది ప్రజలను ఉర్రూతలూగించింది. ట్రంప్ ఉపన్యాసం ముందు ఎండ ప్రతాపం కూడా చిన్నబోయిందా అనిపించింది. టీ అమ్ముతూ సాధారణ జీవితం గడిపే వ్యక్తి దేశానికి ప్రధాని కావడం వెనక అకుంటిత దీక్షతో పాటు ఉక్కు సంకల్పం ఉంటుందని, మోదీ అంతటి గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి అని ట్రంప్ ప్రారంభోపన్యాసం చేసారు. ఎన్నికల్లో సంపూర్ణ ఆధిపత్యంతో విజయం సాధించడంతో పాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన ధీరుడుగా మోదీని ట్రంప్ అభివర్ణించారు.
ఉగ్రవాదాన్ని సహించబోం..
కళారంగంలో భారత దేశం ఎప్పుడూ వైవిద్యాన్ని చాటుకుంటుందని, అందులో భాగంగా దేశంలో ఏడాదికి రెండు వేల సినిమాలు రూపుదిద్దుకుంటాయని ప్రశంసించారు. సృజనాత్మకత, సందేశాత్మక సినిమాలతో పాటు ప్రేమ, వినోదాత్మక సినిమాలకు భారత్ పెట్టింది పేరని ట్రంప్ అభినందించారు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, షోలే వంటి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. భారత దేశంలో ప్రతిభకు, కళలకు లోటు లేదని, కొత్తదనం కోసం పాకులాడే దేశాల్లో భారత దేశం ముందుంటుందని డొనాల్డ్ ట్రంప్ నొక్కి వక్కాణించారు. భారత దేశ సినిమా పేర్లను పలకడంలో కాస్త ఇబ్బంది పడ్డా ప్రజలనుండి మాత్రం ట్రంప్ కు మంచి స్పందన వచ్చింది.
సినిమాలు, క్రీడలు భారతదేశానికి రెండు కళ్లు లాంటివి..
భారత దేశానికి ప్రంపంచ స్దాయి గుర్తింపు తెచ్చింది క్రీడలని, క్రీడలు మనో వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని ట్రంప్ అభివర్ణించారు. క్రికెట్ క్రీడలో క్రికెట్ దేవుడుగా ముద్ర వేసుకున్న సచిన్ టెండుల్కర్ పేరును ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సచిన్ నుండి ప్రస్తుత భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరకూ ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులని, కోట్ల మంది అభిమానులను వీరిద్దరూ అలరించారని గుర్తు చేసారు ట్రంప్. భారత్ దేశం కళలకు ఎంత ప్రాముఖ్యతనిస్తుందో క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యతనిస్తుందని ప్రసంగించారు. అంతే కాకుండా భారతదేశమన్నా, భారత దేశ ప్రజలన్నా తమకు అపార గౌరవమని ట్రంప్ తెలియజేసారు.
హోరెత్తించిన ట్రంప్ ప్రసంగం..
అంతే కాకుండా అమెరికా, భారత దేశం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని సహించేదిలేదని, ఐసిస్ లాంటి ఉగ్రవాదాన్ని ప్రోత్పహించిన సిరియా దేశ పరిస్ధితి ఎలా తయారయ్యిందో అందరూ గ్రహించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి ఊతమిస్తానంటే పాకిస్తాన్ ను కూడా ఉపేక్షించేది లేదని ట్రంప్ స్పష్టం చేసారు. యుధ్ద విమానాల తయారీతో పాటు ఎగుమతులు, దిగుమతుల రంగాల్లో కలిసి పనిచేసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుందని ట్రంప్ ఆకాంక్షించారు. హిమాలయాల్లో హిమనీనాధాల పవిత్రత, చల్లగాలి పిల్ల తెంపర్ల సౌరభాలతో భారతం దేశం మరింత ముందుకు వెళ్లాలని, మోదీ పాలనలో అవన్నీ సుసాధ్యమని వర్ణిస్తూ ట్రంప్ తన ఉపన్యాసాన్ని ముగించారు.