ట్రంప్ వ్యాఖ్యలకు రాజ్నాథ్ దిగ్భ్రాంతి: పారిస్ ఒప్పందంపై ఏమన్నారంటే!
భారత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి అమెరికా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. అగ్రరాజ్యం ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే.. క్రమంగా దీని లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదముందన్న వాదన వినిపిస్తోంది.
చాలా దేశాలు అమెరికా తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నా.. మాకెవరూ చెప్పాల్సిన పని లేదంటూ ఆ దేశ దౌత్యవేత్త నిక్కీ హేలీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి అమెరికా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కాగా, పారిస్ ఒప్పందం భారత్కు అనుకూలంగా ఉందంటూ ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం భారత్ కు పెద్ద మొత్తంలో విదేశీ సాయాన్ని పొందేలా చేస్తుందని, దీనివల్ల భారత్ కే ప్రయోజనం తప్ప తమకు ఒరిగేదేమి లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత్ ఆయన వ్యాఖ్యల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే, ఒప్పందం నుంచి తప్పుకోవాలని ట్రంప్ నిర్ణయాన్ని అధ్యక్ష భవనం వైట్ హౌజ్ కూడా సమర్థించింది. 2030వరకు చైనా కర్బన ఉద్గారాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, భారత్కు 2.5ట్రిలియన్ డాలర్ల సహాయం అందేవరకు ఎటువంటి బాధ్యతలు తీసుకోబోమని తెలిపారు.