భారత్కు ట్రంప్ జూనియర్.. ఢిల్లీకి సమీపంలో ‘ట్రంప్ టవర్స్’, ఫ్లాట్ బుక్ చేసిన వారికి డిన్నర్ చాన్స్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సోమవారం భరత్కు వస్తున్నారు. అయితే ఇదేదో అధికారిక పర్యటన మాత్రం కాదు. ట్రంప్ జూనియర్ తన వ్యాపారానికి సంబంధించిన పనుల నిమిత్తం ఇక్కడికి రాబోతున్నారు.
చదవండి: ట్రంప్ నెత్తిన 'ప్లేబాయ్ మోడల్' పిడుగు! వెలుగులోకి అధ్యక్షులవారి మరో రాసలీల..
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో 'ట్రంప్ టవర్స్' పేరిట ఓ విలాసవంతమైన భవనాన్ని నిర్మించబోతున్నారు. స్థానిక డెవలపర్లతో ట్రంప్ జూనియర్ ఒక ఒప్పందం కుదుర్చుకుని ఈ భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. 2023లోగా ట్రంప్ టవర్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఢిల్లీలో ‘ట్రంప్ టవర్స్'...
ట్రంప్ టవర్స్.. ఈ పేరు వినగానే మనకు ఠక్కున అమెరికా గుర్తొస్తుంది. కానీ 2023 నాటికి ఈ ట్రంప్ టవర్స్ మన దేశ రాజధాని ఢిల్లీలోనూ సాక్షాత్కరించనుంది. అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్లో ‘ట్రంప్ టవర్స్'ను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పనులమీద ఆయన భారత్కు వస్తున్నారు. ట్రంప్ జూనియర్ తన పర్యటనలో భాగంగా భారత్లోని నాలుగు నగరాలు.. ముంబై, పూణే, గుర్గావ్, కోల్కతాలను సందర్శించనున్నారు.
వామ్మో.. ఒక్క ఫ్లాట్ ధరెంతో తెలుసా?
ఢిల్లీలో త్వరలో నిర్మించనున్న ట్రంప్ టవర్స్లో ఫ్లాట్ ఖరీదెంతో తెలుసా? వింటే, గుండె ఆగిపోతుంది. నిజం, ట్రంప్ టవర్స్లో ఫ్లాట్ల ధరలు రూ.5.5 కోట్ల నుంచి రూ.11 కోట్ల మధ్య ఉన్నాయి. ఇక అతి తక్కువ ధర కలిగిన ఫ్లాట్ను కొనాలన్నా జస్ట్ డౌన్ పేమెంట్ కిందే రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ల ధరలు వాచిపోయేలా ఉన్నా సరే, ఇప్పటికే 75 మంది బుక్ చేసుకున్నారట. గురువారం వరకు డెడ్లైన్ పెట్టుకున్నారట. అప్పటికల్లా ఈ ట్రంప్ టవర్స్లో ఫ్లాట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య 100కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం...
47 అంతస్తుల ఈ ట్రంప్ టవర్స్లో మొత్తం 250 ఫ్లాట్లు ఉంటాయి. 2023నాటికల్లా దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఓ భారత క్రికెటర్తోపాటు ప్రముఖ వ్యాపారవేత్తలు ట్రంప్ టవర్స్లో ఫ్లాట్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లో ట్రంప్ ఆర్గనైజేషన్ చేపట్టిన రియాల్టీ వెంచర్లన్నీ పూర్తవడానికి దాదాపు 1.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు.
అమెరికా తర్వాత భారత్లోనే...
డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత నుంచి ట్రంప్ వ్యాపార బాధ్యతలను ట్రంప్ జూనియర్ చూసుకుంటున్నారు. అమెరికా తరువాత ట్రంప్కు భారీ ప్రాజెక్టులు ఉన్నది భారత్లోనే. అంతేకాదు, స్థానిక డెవలపర్లు తమ బ్రాండ్ ‘ట్రంప్'ను వాడుకునేందుకు కూడా ట్రంప్ ఆర్గనైజేషన్ అనుమతినిచ్చింది. ఈ మేరకు వచ్చిన లాభాల్లో కొంత వాటా కూడా తీసుకోనుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. భారత్లో 2016లో ట్రంప్ ఆర్గనైజేషన్కు సంబంధించిన వెంచర్ల ద్వారా రాయల్టీ కింద ఇప్పటికే ట్రంప్ కుటుంబానికి దాదాపు 3 మిలియన్ డాలర్లు అందాయి.
ఫ్లాట్ కొన్నవారికి లక్కీచాన్స్...
ట్రంప్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో నిర్మించే ట్రంప్ టవర్స్లో ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఓ లక్కీ చాన్స్ లభించబోతోంది. అదేమిటో తెలుసా? ట్రంప్ జూనియర్తో విందులో పాల్గొనే అవకాశం. అవును, ఇది ట్రంప్ టవర్స్ ప్రమోటర్లు ఇస్తోన్న ఆఫర్. ట్రంప్ టవర్స్లో ఫ్లాట్ను కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్తో డిన్నర్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని ప్రమోటర్లు ఇప్పటికే ప్రచారం కూడా చేస్తున్నారు.