ఎన్నికల్లో నయా ట్రెండ్! ప్రచార ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్!
ఎన్నికలంటేనే డబ్బుతో పని. గెలుపు కోసం ఒక్కో నాయకుడు కోట్ల రూపాయల్ని మంచినీళ్లలా ఖర్చుపెడుతుంటారు. మరి డబ్బులేని అభ్యర్థుల సంగతేంటి? ఎన్నికల ఖర్చుల కోసం వారు ఏం చేయాలి? ఈ సమస్యకు మంచి పరిష్కారం కనుగొన్నాడు జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్.
రంగీళా గర్ల్ పొలిటికల్ ఎంట్రీ! లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రెడీ!
ప్రచార ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్
జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. సొంత రాష్ట్రమైన బీహార్లోని బెగుసరై నుంచి పోటీకి సిద్ధమయ్యారు. సీపీఐ తరఫున లోక్సభ బరిలో దిగుతున్న కన్హయ్య.. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్తో తలపడనున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి తన వద్ద డబ్బు లేకపోవడంతో అందుకయ్యే ఖర్చును విరాళాల రూపంలో సేకరించాలని కన్హయ్య నిర్ణయించారు. ఇందులో భాగంగా క్రౌడ్ ఫండింగ్ను ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కనీసం రూపాయి అయినా విరాళం ఇవ్వండని కోరుతున్నాడు.
ఓట్ల కోసం నేతల అడ్డదారులు
ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులు అడ్డదారులు తొక్కేందుకు కూడా వెనకాడటంలేదని కన్హయ్య విమర్శించారు. అలాంటి వారంతా ప్రజాస్వామ్యాన్ని అవినీతిమయం చేశారని, ప్రస్తుతం రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ విలువలకు రక్షణ కల్పించే ప్రయత్నంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
గంటల వ్యవధిలో రూ.10లక్షల విరాళాలు
కన్హయ్య కుమార్ క్రౌడ్ ఫండింగ్కు భారీ స్పందన లభించింది. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే రూ.10లక్షలు జమయ్యాయి. దాతలు రూపాయి నుంచి 50 వేల రూపాయల వరకు విరాళం ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.70లక్షలు పోగు చేయాలని కన్హయ్య కుమార్ భావిస్తున్నారు.