అధికారం డమాల్!: విరాళాల వేటలో కాంగ్రెస్, లేఖలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ విరాళాల వేటలో పడింది. కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలలో ఇటీవల అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి విరాళాల కష్టాలు ప్రారంభమైనట్లుగా కనిపిస్తున్నాయి. దీంతో, నిధుల వేటకు శ్రీకారం చుట్టింది.
అధికారంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని ఇవ్వాలని, మాజీ ప్రజాప్రతినిధులు అయితే రూ.లక్ష చొప్పున విరాళాన్ని అక్టోబర్ మొదటి వారంలోగా జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ ఓరా లేఖలు రాశారు.
పార్టీకి చెందిన 44 మంది లోకసభ సభ్యులకు, 65 మంది రాజ్యసభ సభ్యులకు లేఖలు రాశారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున పార్టీ నిధి రూపంలో ఇవ్వాలని ఢిల్లీ పిసిసి విజ్ఞప్తి చేసింది.
దీని నిమిత్తం ఢిల్లీ ఇంఛార్జ్ పిసి చాకో, ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు అజయ్ మాకెన్ బుధవారం మాజీలను కలవనున్నారు. రాష్ట్రాలలోని పిసిసిలు కూడా తలోచేయి వేయాలని పార్టీ కోరింది. రాష్ట్రాల్లో మంత్రులు, మాజీ మంత్రుల నుంచి పార్టీ నిధిని సేకరించాలని ఇప్పటికే విజ్ఞప్తులు వెళ్లాయి. పార్టీ నేతల నుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు విరాళాలు ఇవ్వాలని కోరింది.
బీహార్లో ప్రచారానికి సోనియా, రాహుల్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.. జేడీయూ, ఆర్జేడీ కూటమితో కలిసి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మహా కూటమి తరఫున ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె తనయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు.
మొత్తంగా రాష్ట్రంలో కనీసం నాలుగు బహిరంగ సభల్లో సోనియా పాల్గొనే అవకాశాలుండగా.. రాహుల్ తొమ్మిది సభలకు హాజరయ్యేలా స్థానిక నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రత్యేకించి మజ్లిస్ పోటీ చేస్తున్న సీమాంచల్ ప్రాంతంలో రెండు బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.